Monday 21 May 2012

రెండు దశాబ్దాల కులీన ఉద్యమాలు

ఈ ఇరవై యేళ్లలో స్పెషలైజేషన్ పెద్ద ధోరణిగా ముందుకు వచ్చినట్టే వర్గాన్ని బట్టి వారికి తగిన ఉద్యమాలను కూడా డిజైన్ చేసుకున్నారు. 90ల తర్వాత ట్యాంక్‌బండ్- నెక్లెస్ రోడ్ ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి. కానీ మన దౌర్భాగ్యమేమంటే కొందరు లిబరల్ వాదులు, వామపక్ష వాదులు కూడా ఈ మాయలో పడుతున్నారు. 

ఇరవై యేళ్ల సంస్కరణలు కొత్త మార్కెట్, కొత్త సంస్కృతితో పాటు కొత్త ఉద్యమాలను కూడా సృష్టించుకున్నాయి. ఇన్నిన్ని కార్పొరేట్ చారిటబుల్ ట్రస్టులు ఉన్నప్పుడు వారి అనుచరవర్గం ఏదో ఒక ఉద్యమం చేయాలి కదా! కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన ఉద్యమాలన్న మాట! నెక్లెస్‌రోడ్‌లో ఫైవ్‌కె రన్నో టెన్‌కె రన్నో ఆర్గనైజ్ చేస్తారు. హైక్లాస్ అబ్బాయిలు, అబ్బాయిలు డిజైనర్ టీషర్టులు ధరించి పాల్గొంటారు. సమాజానికి ఆరోగ్య ప్రాధాన్యం తెలియజేయడమనే ఈ మహత్తర ఉద్యమంలో సినీనటులు కూడా పాల్గొని చీర్ అప్ చేస్తారు. ఇంత కష్టమైన ఉద్యమాల్లో చీర్‌గర్ల్స్ లేకపోతే కష్టమైపోతుంది మరి!. వీళ్లు మాత్రమే కాకుండా నగర సివిల్ పోలీస్ అధికారులు, ఇంకా పురప్రముఖులనబడే వాళ్లు కొందరు తమవంతుగా కొన్ని అడుగులేస్తారు. ఉద్యమంలో పాల్గొనడం అంత ఈజీ కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొనాలంటే తలా ఇంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

వామపక్ష ఉద్యమాలకు జనం స్పందన తగ్గుతోందని ఆందోళన పడుతుంటారు. కానీ ఇక్కడ ఎదురుడబ్బులిచ్చి మరీ పాల్గొంటారు. హైక్లాస్ సోషలైజింగ్ తమ్మీ. ఆషామాషీకాదు. ఉదయపు పరుగులో అలసిపోతే సాయంత్రం ఏ బాటిల్స్ అండ్ చిమ్నీస్‌లోనో చల్లబడే అవకాశం కూడా ఇటువంటి సోషలైజింగ్‌లో ఉంటుంది. సెడెంటరీ లైఫ్‌స్టెయిల్ వల్ల కొవ్వెక్కితే అది కరిగించుకోవడానికి రోజూ నడువవలె, జాగింగ్ చేయవలె అనునది ఈ ఉద్యమం అందించు సందేశం. అన్ని నగరాల్లో ఈ హైటెక్ ఉద్యమం పరిగెడుతుంది. ముంబైలో అనిల్ అంబానీ, జాన్అబ్రహాం లాంటి ప్రముఖులు పాల్గొంటారు. ఇదెక్కడి సామాజిక ఆరోగ్యం? ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటుకు, పాముకాటుకు మందులేక వందలాది మంది రాలిపోయే దేశంలో మలేరియా మందులిచ్చే దిక్కులేక వేలమంది గిరిజనులు రాలిపోయే దేశంలో ఇదెక్కడి ఆరోగ్య ప్రచారం, ఇది ఎవరి కోసం అని ప్రశ్నించడం అమాకత్వమనిపించుకుంటుంది. 

ఈ ఇరవై యేళ్లలో స్పెషలైజేషన్ పెద్ద ధోరణిగా ముందుకు వచ్చినట్టే వర్గాన్ని బట్టి వారికి తగిన ఉద్యమాలను కూడా డిజైన్ చేసుకున్నారు. ఎఫ్ఎం చానళ్లు, ఐటి కుర్రాళ్లు క్లీన్‌సిటీ లాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అపుడపుడు టీషర్టుల మీద కంపెనీల పేర్లు అవీ రాసుకుని ఓ పూట ట్రాఫిక్ కంట్రోల్‌లో పాల్గొంటారు. గివింగ్ బ్యాక్‌టు సొసైటీ యార్! కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యూత్ ఫర్ సోషల్ కాజ్ లాంటి మాటలు భలే ముచ్చటగా ఉంటాయి - ఆ కుర్రకారు లాగే. కార్పొరే ట్లు ఇన్ని చేస్తుంటే వారి సామంతులైన పాలకులు ఊరుకుంటారా... మేము సైతం అని ఆవేశంగా ఉద్యమ బాట పడతారు. కల్చరల్‌వాక్, హెరిటేజ్‌వాక్ లాంటివి ఆర్గనైజ్‌చేస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు మురికి దిబ్బలుగా మారితే పట్టించుకునే దిక్కుండదు కానీ హైదరాబాద్‌లో హెరిటేజ్ వాక్స్ జరిపిస్తూ ఉంటారన్న మాట. 

మరోవైపు ఈ ఇరవై యేళ్లలో మనుషుల మీద కంటే జంతువుల మీద ప్రేమ తెగ పెరిగిపోయింది. పాముల ప్రేమ, కుక్కల ప్రేమ, కాకుల ప్రేమ, పిట్టల ప్రేమ.. అబ్బో ఈ ప్రేమోన్మాదానికి అంతే లేదు. పెటపెటలాడే ఈ ఉద్యమాలకు హైక్లాస్ సర్కిల్స్‌లో ఆదరణ ఎక్కువే. అందంగా కనిపించే కొండ చిలువ లాంటి పామును మెడలో వేసుకోవడం, భయపడుతున్న కాలేజీ విద్యార్ధుల మెడలో వేసి భయాన్ని పోగొట్టడం ఒక ఉద్యమం. వెజిటేరియనిజం సంగతి చెప్పనే అక్కర్లేదు. అది ఇవాల్టి తారక మంత్రం. ఆకులు అలుములు తినండి ముఖ వర్చస్సు కాపాడుకోండి అనునది దాని నినాదం. జంతువులను చంపడం మహా పాపం అను పాపభీతి ప్రచారం దానికి అదనం. ఆకుకూరలు మొలకు చుట్టుకుని అందమైన అమ్మాయిలు ముప్పాతిక నగ్నంగా ప్రదర్శనలివ్వడం, బోనులో కూర్చుని ఫోజులివ్వడం ఈ ఉద్యమ పంధా. 

దేహంపై రక్తం వలె పెయింట్ రాసుకుని మీరు తింటున్నదిదే... ఇలాంటిదే అని ప్రదర్శనలివ్వడం ఉద్యమంలో తరచుగా కనిపించే ఘట్టం. మన దగ్గర ఇంకా చట్టాలవీ కొంచెం సంప్రదాయకంగా ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే బ్లూఫిల్మ్‌లే చూయించేవారు. ఆ మధ్య ఏదో దేశంలో వేదికమీద రతిభంగిమలను లైవ్లో ప్రదర్శించారు. ఏమిటంటే ఏదో జంతుకారుణ్య ఉద్యమమట. జనం దృష్టిపడాలంటే ఇలాంటివేవో చేయాలట. మనదగ్గర ఉద్యమం ఈ స్థాయిలో ఉధృతం కాకుండా సంప్రదాయ చట్టాలు అడ్డుపడుతున్నాయని కొందరు జంతుకారుణ్య వాదులు బాధపడుతూ ఉండొచ్చేమో. మనుషుల దృష్టి ఆకర్షించడానికి జీవకారుణ్యం బ్యాచ్ ఇలాంటి విన్యాసాలు అనేకం చేస్తూ ఉంటుంది. నగ్నత్వ ప్రదర్శన దానికదే నేరం కాదు. అది ప్రొటెస్ట్‌ఫామ్‌గా ఉపయోగపడొచ్చు. మణిపూర్ ఆడవాళ్లు కూడా నగ్న ప్రదర్శన చేశారు. వాళ్ల ప్రదర్శన మనలో అగ్గిరాజేస్తుంది. ఆలోచన రేకెత్తిస్తుంది. జంతుకారుణ్యం పేరుతో సెలీనా జైట్లీ మొలకు ఆకులు అలుములు చుట్టుకుంటే అదే దృష్టితో చూడలేం. 

ఇక పర్యావరణం సంగతి సరేసరి. అదింకా ఊపులో ఉంది. భారీ ప్రాజెక్టులు, భారీ అభివృద్ధి గురించి మాట్లాడేవారు, వారి వారసులు కూడా ఈ ఉద్యమాల్లో ఉండడం ఆధునిక వింత. నిజమైన పర్యావరణ ప్రేమికులు ఉండవచ్చును. కానీ మనుషులతో సంబంధంలేని పర్యావరణం గురించి మాట్లాడేవారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కొవ్వొత్తి ఉద్యమాల గురించి మాట్లాడే పనేలేదు. 90ల తర్వాత ట్యాంక్‌బండ్- నెక్లెస్ రోడ్ ఉద్యమ కేంద్రాలుగా మారిపోయాయి. కానీ మన దౌర్భాగ్యమేమంటే కొందరు లిబరల్ వాదులు, వామపక్ష వాదులు కూడా ఈ మాయలో పడుతున్నారు. పర్యావరణం అవసరం కదా, జంతుకారు ణ్యం అవసరమే కదా అని భుజానికెత్తుకుంటున్నారు. ఎవరు ఏ రూపంలో గొంతెత్తుతారా, చేయెత్తుతారా.. ఎగిరెగిరి ప్రోత్సహిద్దామా అని పొంచి కూర్చున్న లిబరల్స్ చాలామందే తయారయ్యారు. ఏది కడుపు మండిన తనం, ఏది కడుపు నిండిన తనం అనే తేడా చూడలేని స్థితికి చేరుకున్నారు. ప్రయారిటీస్ చూడలేని స్థితికి చేరుకున్నారు. 

నిన్న కాక మొన్నేమైంది? ఎర్త్ అవర్ అన్నారు. గంటసేపు లైట్లు ఆపేయాలి అన్నారు. రాష్ట్రపతి భవన్ దగ్గర్నుంచి మన గల్లీలో ఇంటర్ చదివే కుర్రాడి దాకా అందరూ ఓ ఒకటే హడావుడి. క్రికెట్‌స్టార్లు, సినిమా స్టార్లు... పోటీలు పడి మరీ ఎర్త్ అవర్ ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంతకుముందు జరిగిన ఎర్త్అవర్‌లో ఇంకా హడావుడి జరిగింది. విద్యుత్‌ను పొదుపు చేయాలనుకోవడం మంచిదే. అదొక జీవన విధానమా.. లేక ఏడాదంతా విచ్చలవిడిగా ఖర్చుచేసి ఒక పూట చేసే విన్యాసమా? మన దగ్గర పాతికమంది ఖర్చుచేసే కరెంటు అమెరికన్లు ఒక్కరే ఖర్చుచేస్తారు కదా, ఓ వైపు ఆ జీవన విధానాన్ని అనుకరిస్తూ మరోవైపు పొదుపు మంత్రం పఠించడంలో అర్థమేమిటి? ముగ్గురు మనుషుల కోసం 26 అంతస్తుల రాక్షస భవంతిని కట్టుకున్న వాళ్లు కూడా ఈ దేశంలో ఎర్త్ అవర్‌కు మద్దతివ్వగలరు. 

ఇక్కడేదైనా సాధ్యమే. పెళ్లిళ్లలో అవసరమున్నా లేకపోయినా విపరీతంగా లైట్లు పెట్టి హడావుడి చేస్తున్నాం కదా, అక్కడేమైనా పొదుపు చేస్తున్నామా..! మన వినోదం కోసం రంగురంగుల ఫౌంటెన్లు పెట్టి హడావుడి చేస్తున్నాం కదా వాటి గురించేమైనా ఆలోచిస్తున్నామా..! అవసరమున్నా లేకపోయినా రాత్రిపూట క్రికెట్‌మ్యాచ్‌లు పెట్టి ఫ్లడ్ లైట్లకు ఎంతెంత కరెంటు ఖర్చుచేస్తున్నామో ఆలోచించామా! పల్లెల్లో కరెంట్ ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలీక రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు పడుతూ ఉంటారు. అదాటున ఏదో వైర్ తగిలి చచ్చిపోతూ ఉంటారు. కానీ నగరాల్లో మాత్రం అరగంట ఎసి పనిచేయకపోతే కిందామీదై పోతుంటారు. 

దాని గురించేమైనా ఆలోచించామా! వీటి గురించి ఆలోచించకుండా ఏడాదంతా విచ్చలవిడిగా కరెంట్ తగులబెట్టే వారే ఒక్కరోజు మన ముందుకు వచ్చి ముద్దుముద్దుగా ఎర్త్ అవర్ అని సూక్తులు చెపితే మనం గొర్రెల్లాగా ఊకొట్టాలా... ఏమి దౌర్భాగ్యమిది? మీడియా కంటే ఈవెంట్స్ కావాలి. దాని అవసరాలు దానివి. అందుకని అది ఇతోధికంగా ఇలాంటి కొత్త తరహా ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది. కానీ పురోగామివాదులం అనుకునేవారికేమైంది? ఏ పదార్ధమైనా వర్గ ప్రయోజనాలకు బయట ఉండదు కదా! ఎవరి ఆరోగ్యం, ఎవరి పట్ల కారుణ్యం, ఎవరి హక్కులు, ఎవరి కరెంట్, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం అనే ప్రశ్నలు లేకుండా అన్నింటికీ తలూపే వర్గరాహిత్య మనస్తత్వం మన నరాల్లో ఇంతగా పాకిపోయిందా అని ఆశ్చర్యమేస్తున్నది.
(2012, ఏప్రిల్‌ 11న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

1 comment:

  1. Rural Reporter Sainath eppudo chepparu Media entha shaktivantamainadoo. A honest attempt on the present situation

    ReplyDelete