Monday 24 October 2011


టీ వీ భాష-కొన్ని విషయాలు

టీవీల్లో వాడే భాష తెలుగులాగా లేదని, ఈ సంకరతనం చూడలేక చస్తున్నామని చాలామంది భాషాభిమానులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ చాన ళ్ళ సంగతి సరే, న్యూస్ చానళ్లలో కూడానా అని ఆవేదన. ఈ ఆవేదన సమంజసమైనది. కాకపోతే చాలామంది పెద్దమనుషు లు దీని వెనుక చూస్తున్న కారణాలు పాక్షికమైనవి.

ప్రత్యేకించి టీవీ జర్నలిస్టులకు, యాంకర్లకు శిక్షణ సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఇవాళ ప్రింట్ అయినా టీ వీ అయినా శిక్షణ లోపం అన్నింట్లోనూ ఉంది. కాకపోతే న్యూస్ చానళ్ళు ఒక్కసారిగా తోసుకుని రావడం వల్ల లోపం ఓ తులం ఎక్కువ ఉండొచ్చు. అది జనరల్ అంశం. టీవీల స్వభావంతోనే ముడిపడిన నిర్దిష్టమైన కారణాలు వేరే ఉన్నాయి.

న్యూస్ చాన ళ్ళు ప్రధానంగా అర్బన్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్ రూపొందించుకుంటాయి. ఎందుకంటే ఆడి యెన్స్‌ని కొలిచే టామ్ వ్యవస్థ పట్టణాలకే పరిమితం. యాడ్స్ అన్నీ పట్టణ విద్యావంతులైన యువత మీదే ఆధారపడి ఉంటాయి. పట్టణ పరిభాషకు సంబం«ధించి, ఆంగ్ల వాడకానికి సంబం«ధించి మనకున్న అవగాహన, అందులోని లోటుపాట్లు అన్నీ టీవీల్లో ప్రతిఫలిస్తాయి.

వాస్తవానికి అన్యదేశ్యాల వాడకం కంటే తీవ్రమైన సమస్యలున్నాయి. ఇరవై ఏళ్ళలో వచ్చిన సామాజిక పరిణామా ల వల్ల ఇపుడు కాలేజీల నుంచి జర్నలిజంలోకి వస్తున్న వారిలో ఎక్కువ మందికి సమాజం గురించిన అవగాహన, పట్టింపు అంతకుముందు తరాలతో పోలిస్తే తక్కువ. ఇది అండర్‌స్టేట్‌మెంట్. ఒకచోట 160 మంది విద్యార్ధులను ఇంటర్య్వూ చేస్తే నలుగురు మాత్రమే శ్రీశ్రీ, చలం పేర్లు విన్నారని తేలింది.

ఈ విషాదంలోకి వెడితే బయటకు రాలేం. తాము చదివే వార్తలకు చాలామంది న్యూస్ రీడర్లకు ఉన్న బంధం పరాయిది. నిజ జీవితంలో ఎన్నడూ రాని పాజింగ్ సమస్య వార్తలు చదివేప్పుడే ఎందుకు వస్తుంది? విషయమూ, వాక్యమూ బయటివి కాబట్టి. అవగాహన, ఉచ్ఛారణ, పదాల పొందిక-విరుపు, వాడే పదజాలం మీడియా భాషకు సంబంధించిన ముఖ్యమైన విషయా లు.

అవగాహన గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన విషయాలను చూద్దాం. స్క్రీన్ మీద కనిపించే వారిని కూడా పట్టణాల నుంచే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉచ్చారణ వ్యవహారంలో భాగంగా వస్తే సహజంగా ఉంటుంది. కానీ పట్టణాల్లోని చదువుల వల్ల తెలుగును పిల్లలు నేర్చుకోవాల్సి వస్తున్నది. లిపి నుంచి నేర్చుకున్న తెలుగు వ్యవహారంలో భాగంగా ఒంటబట్టే తెలుగంత సహజంగా ఉండదు.

ఎందుకంటే ఉచ్చారణ ప్రాధమికం. లిపి ద్వితీయం. కొంతమంది వ్యవహారంలోనే నేర్చుకున్నా పలుకుబడులు, జాతీయాలు, సామెతలతో సంప ర్కం తక్కువ. చందమామ, బాలమిత్రల మీదుగా నడిచొచ్చిన బాల్యానికి ట్వింకిల్ ట్వింకిల్ మీదుగా నడిచొచ్చిన బాల్యానికి తేడా ఉంటుంది. ఒక్కముక్కలో న్యూస్ రీడర్లు మాట్లాడే తెలు గు మీద అర్బన్ సమాజంలో ఆధిపత్యంలో ఉన్న సంస్కృతి ప్రభావం ఉంటుంది. ఒక రకమైన వింత ఉచ్చారణతో మాట్లాడడం స్టెయిల్ అనే పేరుతో నగరాల్లో చెలామణిలో ఉంది.

చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల భాష చూడండి. తెలుగేనా అంటే తెలుగే. కానీ తెలుగులాగా వినిపించదు. సూర్యకాంతం తెలుగును, త్రిషకు చెప్పే డబ్బింగ్ తెలుగును పక్కపక్కన వింటే తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆశాభోంస్లేను గాయనిగా తప్పు పట్టగలమా! మరి ఆమె అడుగులు నేర్పావు అని-పావుశేరులో పాను పాడేసింది. తప్పుఆమెది అన లేం.

అసలే ''నువ్వంటే పాడిపాడి చస్తానే'' అని స్టెయిలిష్‌గా 'వరవషం'తో హమ్ చేసుకుంటున్న కాలం. సినిమా మార్కెట్ ఆ విధంగా అలోచిస్తోంది. ''యాతమేసి తోడినా ఏరు ఎండదు - "పొగిలిపొగిలి ఏడ్చినా పొంత నిండదు'', "సడిసేయకే గాలి'' లాంటి పాటలకు ఇపుడైతే ప్రతిపదార్ధ, తాత్పర్యమివ్వాల్సి ఉంటుంది. కచ్చతనంతో ఈ పనిచేశాడు.. లో చ్చను పచ్చదనంతో పరవశిస్తోందిలోని చ్చను ఒకేరకంగానే పలుకుతారు కొంతమంది . వెనక్కు లాగాడులో గా ను రాగాలు తీశాడులో గా ను ఒకే రకంగా పలుకుతారు.

జానెడు పొట్ట, జారుడు బల్లల్లో ఒకటే జ. చవితి చంద్రుడొచ్చాడంటే చచ్చారే. ఒక్కటే చ. ఱ లాగే మూడో చ, మూడో జ కూడా అంతరించి పోతున్న జాతుల్లో చేరే ప్రమాదం కనిపిస్తోంది. అది సహజమైన మార్పు అయితే ఆహ్వానించొచ్చు. ఈ మార్పు కృత్రిమమైనది. కింది నుంచి వచ్చిన మార్పు కాదు. పైనుంచి రుద్దుతున్నది. రాసారు చేసారు శబ్దాలు సాధారణమై పోయాయి.

తల్లనకా-పిల్లనకా రెంటిలో రెండో అక్షరం శబ్దం ఒకటే. సర్వ శబ్ద సమానత్వం! పైడి తల్లమ్మకూ ఈ తిప్పలు తప్పవు. పుల్లమ్మలో ల్ల శబ్దంతో ఆమెకు జాతర చేస్తారు. చెప్పారు కు అప్పారావుకు తేడా ఉండ దు. కొట్టాడు - పట్టాలు, తన్నాడు - చిన్నారావు సేమ్ టు సేమ్. ఒక్క 'ఎఇ' శబ్దాలకే పరిమితమైన సమస్య కాదు. మౌలికంగానే ఈ ఉచ్చారణ పద్ధతి వేరు. ఇది వ్యక్తుల సమస్య కూడా కాదు.

టీవీల్లో ఆన్‌స్క్రీన్‌కి మార్కెట్ నిర్దేశించిన అర్హతల్లో తెలుగుదనం ప్రధానమైనది కాదు. ఉచ్చారణకు లిపికి సంబంధించి వర్తమాన అవగాహనకు అద్దంపట్టే ఉదాహరణ టీవీలతో పాటు పుట్టుకొచ్చిన ఒక ఆంగ్ల పదం వాల్డ్. వరల్డ్ కొచ్చిన తిప్పలు. వరల్డ్ రాస్తే ఆర్ సైలెంట్ చేయకుండా (అది సైలెంట్ చేయకపోతే స్టెయిల్‌గా ఉండదని భయం) అలాగే చదివేస్తారనే భయంతో పదాన్నే మార్చేసి మన వార్తా రచయితలు ఈ కొత్త పదాన్ని సృష్టించారు. అదియందు శబ్దముండెను అని ఆధ్యాత్మికంగా నమ్మేవారు సైతం సాంస్కృతిక వ్యవహారాల దగ్గరికొచ్చేసరికి ఆదియందు వాక్యముండెను పద్ధతి పాటిస్తారు. ఇదో వైరుధ్యం.

నిరుడు అనే పదం 'ఆడ్‌గా' అనిపించి గతేడాది అనే దిక్కుమాలిన పదం ప్రమాణమై కూర్చుంటుంది. శక్తిలోపం కంటే అవగాహన లోపం వల్ల ఏర్పడే ప్రమాదం ఎక్కువ కాబ ట్టి దీని గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక తత్సమాలు, తద్భవాల చర్చలోకి అడుగుపెట్టే పరిస్థితే లేదు. టీవీ చానళ్లలో కూడా ముఖయంత్రము, కరణము అని బొమ్మలు అవీ వేసి నాలుక ఎక్కడ తగిలితే ఏ శబ్దం వస్తుంది అని వివరించాలనే తపన ఉన్నవారుంటారు.

ఓష్ఠ్యాలు, దంత్యాలు, అనునాసికాలు అని ఏమోమో నూరిపోయాలనుకునే వారుంటారు. కానీ అది మార్కెట్ అవసరం కాదు. ఇదంతా ఎందుకంటే సినిమాల్లోనయినా టీవీల్లోనయినా తెలుగును తెలుగులాగా పలకడం అనేది ప్రమాణం కాదు. మార్కెట్ అవసరం కూడా కాదు. పట్టణాల్లో ఈ కొత్త తెలుగుకు ఆమోదం వస్తున్నది. పై తరగతి అలవాట్లను కింది తరగతి అనుసరిస్తుంది కాబట్టి ఇది ప్రమాణంగా కూడా మారుతున్నది.

టీవీలో పనిచేసే జర్నలిస్టులనో, యాంకర్లనో మరొకరినో తప్పుపట్టాల్సిన పనిలేదు. మార్కెట్ శాసిస్తుంది. భాష పాటిస్తుంది. ఏ వ్యవస్థ అయినా దాని అవసరానికి తగినట్టే తనను తాను తీర్చుదిద్దుకుంటుంది. మార్కెట్ ముందు సెంటిమెంట్లు, విలువల భాషణలు పనిచేయవు.

తెలుగు అజంతమూ, ఎల్లోరానా అని హనుమాన్ చాలీ సా పఠించడం వల్ల లాభం ఉండదు. మనం ఎడిటర్లకు మహాజర్లు అవీ సమర్పించడం వల్ల మహా అయితే పైపై మార్పులు సాధించగలమేమో (అది కూడా ఆ ఎడిటర్ భాషాభిమాని అయి ఉంటే). ఇవాళ సమాజంలో ఎదగడానికి తెలుగు అవస రం అంతగా లేదు. చదువుల్లో ఉద్యోగాల్లో అది ప్రతిఫలిస్తున్న ది. అక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అది కొంచెం పెద్ద విషయమే. పెద్ద విషయాలు పరిష్కారం కావాలంటే పెద్ద ప్రయత్నాలే జరగాలి.

-జి.ఎస్.రామ్మోహన్
(2010 నవంబర్‌ 11న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వ్యాసం)

No comments:

Post a Comment