Saturday 15 June 2013

చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?

చేపమందు అలియాస్ చేప ప్రసాదము శాస్త్రీయమైనదా కాదా అని చర్చించడం వల్ల ప్రయోజనం లేదు. ప్రసాదాన్ని దాని విలువను హేతువుతో ఎదుర్కోలేము. జనవరి ఒకటో తేదీన తిరుమలకు పోటెత్తే వారి మధ్యలో నిలబడి హేతువును ప్రదర్శించడం వల్ల ప్రయోజనమేదీ లేదు. కాకపోతే ఇతరత్రా మూఢనమ్మకాలకంటే చేపమందు లాంటి ఉచిత మందులకు లెజ్టిమసీ ఎక్కువ ఉంటుంది. అభ్యుదయ శిబిరంలో కూడా నిర్లిప్తత నుంచి సానుభూతి వరకూ అనేక ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. మంత్రమేసి మాయచేసి ప్రపంచీకరణ ద్రుష్పభావాలను తీసేయొచ్చు అనుకునే రొమాంటిస్టులను కాసేపు పక్కనబెడదాం. ప్రసాదంలో దాగిన ఉచిత విలువ గురించి అయితే మాట్లాడుకోవాలి.

అలాగే బత్తినవారి నుంచి రాష్ట్రంలోని మూలమూలలా కొలువైన సోములోర్ల వరకూ ఎందుకంత ప్రాచుర్యం పొందుతున్నారన్న విషయం కూడా మాట్లాడుకోవాలి. అదొక విశ్వాసమని కొందరు మాట్లాడుతున్నారు. అక్కడికొచ్చిన వారంతా ప్రసాదం తీసుకోవడం వల్ల తమ వ్యాధి నమమైపోతుందన్న తిరుగులేని విశ్వాసం ఉన్న వారేమి కాదు. తిరుమల వెళ్లడం వల్ల తాము కోరుకున్న కోరికలన్నీ కచ్చితంగా ఈడేరుతాయని భక్తులకు నమ్మకమేమి ఉండదు. అదొక అభౌతిక ప్రయత్నం. అంతే. కొలవడం వల్ల వచ్చేది ఉంటుందో లేదో గ్యారంటీ లేకపోయినా కోల్పోయేదేమీ ఉండదు. మనుషులతో అవసరాలు తీరనపుడు ఆపద తీరనపుడు తీర్చగలిగిన వాడు ఎవడో ఒకడున్నాడనుకుంటే అదో తృప్తి. దేవుని మీద విశ్వాసం నిజంగా ఉంటే భయం కూడా ఉండాలి.

భయమూ భక్తి ఉంటే ప్రపంచం ఇలాగ ఎందుకుంటుంది? తప్పులు చేస్తే అక్కడ నూనెలో వేయిస్తారని, రంపాలతో కోస్తారని కూడా భయం ఉండాలి కదా! అంత భయం ఉంటే ఇన్ని నేరాలెలా జరుగుతాయి, ఇన్ని అవినీతి పనులు, రేపులు, మర్డర్లు ఎవరు చేస్తున్నారు. అందరూ నాస్తికులు కాదు కదా! అంటే దైవాన్ని కూడా టైలరింగ్ చేసుకుని తమకు అవసరమైనంత మాత్రమే నమ్మదలుచుకున్నారన్నమాట. అవసరార్ధం దైవత్వం!
ఆస్తమాను పూర్తిగా పరిష్కరించగల వైద్యం ఇంకా రాలేదు. బాధితులు ఏం చేస్తారు? వైద్యం పూర్తిగా పరిష్కరించలేదు కాబట్టి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. ఆధునిక వైద్యం అసంపూర్ణంగానే ఉంటుంది. తనను తాను పరీక్షించుకుంటూ నిరంతరం పురోగమించే శాస్త్రం అసంపూర్ణంగానే ఉంటుంది. సోములోర్లు, వారి ప్రసాదాల పుట్టుకకు వాటి ఆదరణకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 1) ఆధునిక వైద్యం పరిష్కారం చూపించలేని సమస్యలు 2) వైద్యం అందుబాటులో లేకపోవడం 3) ఆర్థికంగా అందుబాటులో లేకపోవడం. ఉచితం అనేది వీటికి లెజ్టిమసీ కల్పించే అదనపు విలువ. ఆ విలువ వ్యక్తులకే కాక వారు చేస్తున్న పనికి కూడా కొంత 'పవిత్రత'ను గౌరవాన్ని ఆపాదిస్తుంది.

కాషాయం కప్పుకుంటే అది ఇంకాస్త ఇనుమడిస్తుంది. రూపాయి విలయతాండవం చేస్తున్న సమాజంలో ఎవరైనా ఉచితంగా సేవ చేస్తున్నారంటే దాని శాస్త్రీయత కంటే అందులోని ఉచిత విలువ పెద్దగీతగా మారుతుంది. ఆ మందు ఉపయోగవిలువ మీద నమ్మకం లేని వారిని సైతం ఈ ఉచిత విలువ ఆకర్షిస్తుంది. బత్తిన వారి మందు తిని మాకు ఆస్తమా తగ్గిపోయింది అనే వారు అంతగా కనిపించకపోయినా జనం ఇంకా వస్తున్నారంటే ఇలాంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఉచిత ప్రసాదం కాబట్టి అది పనిచేయకపోయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఉచితంగా ఇచ్చారు కదా అనే భావన పనిచేస్తుంది. ఇతరత్రా కారణాలవల్ల సాధారణంగానే తగ్గిపోయిన వారు ఒకరిద్దరు ఉన్నా ఘనంగా చాటుకుంటారు. ఉచితంగా మందు ఇచ్చిన మహానుభావులకి దండాలు పెడుతూనే ఉంటారు. అడిగినవారికీ అడగని వారికీ చాటింపు వేస్తూనే ఉంటారు.


మన కళ్లముందే జరిగిన ఒక పరిణామాన్ని గుర్తుచేసుకుంటే మనం చెప్పుకున్న మూడు కారణాలు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. పదిహేను, ఇరవై యేళ్ల క్రితం దాదాపు ప్రతి తాలూకాలో ఒకరన్నా పాముల నరసయ్య ఉండేవారు. పాము కరిచిన వారిని ఎద్దులబండిమీదో ట్రాక్టర్‌మీదో తీసుకుని వెడతారు. ఆయనేం చేస్తారు? నోటితో నాలుగు మంత్రాలు చదివినట్టు చేసి ఒక కుండలోని మజ్జిగ తీసి ఇస్తారు. సాధారణంగా ఏం జరుగుతుంది. విషపు పాము కరిస్తే ఆ మోతాదు ఎక్కువుంటే పేషెంట్‌మీద మంత్రాలేమీ పనిచేయవు. చనిపోతారు. కానీ అన్నీ విషసర్పాలు కావు కదా! మన దేశంలో భూమి మీద సంచరించే పాముల్లో నాగుబాము(త్రాచుపాము అన్నా అదే), కట్లపాము, రక్తపింజర మాత్రమే విషపూరితమైనవి. మిగిలివవి కావు. పాము కుట్టినపుడు జ్ఞానం కంటే భయం ఎక్కువ పని చేస్తుంది కాబట్టి ఏ జెర్రిపోతో కుట్టేసినా భయపడి పాములోరి దగ్గరకు పరిగెడతారు. వారందరూ బ్రతికేస్తారు. సాధారణంగా ఈ నరసయ్యలు డబ్బు డిమాండ్ చేసి తీసుకోరు. మీరు దండంపెట్టి అంతో ఇంతో చేతిలో పెడితే తీసుకుంటారు. లేకపోతే లేదు. డబ్బు డిమాండ్ చేయలేదు కాబట్టి పేషెంట్ బాధ్యత మనమీదే వేసుకుంటాం. చనిపోతే మన ఖర్మ అనేసుకుంటాం.

లేకపోతే ముందు రావాల్సింది, లేటయ్యింది, పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు అని మన పక్కనున్న వారే అనేస్తారు. ఇదంతా ఉచితం వల్ల, గౌరవంవల్ల ఒనగూరే ప్రయోజనం. పాముల నరసయ్య దగ్గరకు కాకుండా ఆస్పత్రికి తీసుకుపోయి యాంటీవీనమ్ కనుక ఇప్పిస్తే ఆ చనిపోయే వారు కూడా బతికేయగలరు. కానీ యాంటీవీనమ్ ఇస్తే బతుకుతారు అని వారికి తెలియడంతో పాటు అది అందుబాటులో ఉండాలి. వైద్యానికి సంబంధించినంతవరకూ అనుభవమే జ్ఞానం. మన అనుభవమే కాకపోవచ్చు, పక్కవాడి అనుభవం కూడా కావచ్చు. ఇంతకుముందు చిన్న చిన్న పట్నాల్లో యాంటీవీనమ్ అందుబాటులో ఉండేదికాదు. కాబట్టి ఆ అనుభవం వారికి లేదు. ఇపుడు అది అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రులు పెరిగాయి. రహదార్లు పెరిగి ప్రయాణ సమయం తగ్గింది. అది అందుబాటులోకి అనుభవంలోకి వచ్చాక ఇపుడు పాముల నరసయ్య దగ్గరికి వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. నరసయ్యలు కూడా తగ్గిపోయారు. ఒకప్పుడు ఇటు పల్నాడు నుంచి అటు రాయలసీమ వరకు ఎవరి చేతిమీద చూసినా గుండ్రటి వాతలు కనిపించేవి. కామెర్లు వస్తే అదే దారి. కానీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక వాటి పనితీరు చూశాక ఆ అవస్థ తప్పింది. అభివృద్ధి చెందిన కృష్ణా లాంటి ప్రాంతాల్లో వేరే రోగాలు ఎన్నున్నా ఇలాంటివి మొదట్నుంచి తక్కువే. ఒక వెనుకబాటు తనం అనేక వెనుబాటుతనాలకు కారణమవుతుంది.

ఆస్తమా తీవ్రంగా బాధిస్తా ఉంటుంది. అదుపు చేయడం తప్ప పూర్తి పరిష్కారం సూచించే మందు లేదు అని డాక్టర్లు చెప్పేస్తారు. ఏమి చేస్తాడు రోగి? ఈ అమ్మ పెట్టకపోతే పెట్టే అమ్మను వెతుక్కుందాం అనుకుంటాడు. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. పోయేదేమీ లేనపుడు ఇక్కడా ఒక రాయేసి చూద్దాం అనుకుంటారంతే. వేరే ప్రత్యామ్నాయం లేనపుడు కాసేపు క్యూలో నుంచొని ఒక చేప మింగితే పోయేదేముంది అనుకునే వారే ఎక్కువ.

సమస్త బాబాలంతా బతికేస్తున్నది ఈ ధోరణి వల్లే. నీకు ఏదో కాలేయ సంబంధమైన, గుండె సంబంధమైన వ్యాధి వస్తుంది. అవి చిన్నచిన్న ఊర్లలో నయం కావు. నగరాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్లే స్థోమత ఉండదు. అపుడు పేదలేం చేస్తారు? ఎవరో సలహా ఇస్తారు. డాక్టర్లా పాడా, వారు జలగల్లాగా పీల్చేస్తారు కానీ నయం చేయరు, ఇదిగో ఇక్కడో సోములోరు ఉన్నారు, వారు ఎంత మొండి వ్యాధులైనా నయం చేస్తారు అని సలహా ఇచ్చేస్తారు. డబ్బు అందుబాటులో లేనపుడు డాక్టర్ జలగలాగే కనిపిస్తాడు. (డాక్టర్లలో కొందరు జలగలుండే మాట వాస్తవమే కానీ మొత్తంగా ఆధునిక వైద్య వ్యవస్థ జలగలమయమని వారికంటే మందులోళ్లు, మంత్రగాళ్లు నయమని అనుకోవడం చాలా చాలా వెనుకబాటు తనం-ఈ వాదం ఎంత అత్యాధునికమైన ప్యాకేజ్‌లో ఉన్నప్పటికీ!) సోములోరు భగవంతుడిలాగా కనిపిస్తారు. తాను చేయలేని పనిని తక్కువగానూ చేయగలిగిన పనిని ఘనమైనదిగానూ భావించడం మానవసహజం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వచ్చాక బాబాలు, సోములోర్ల దగ్గరకు ఆరోగ్య కారణాల రీత్యా వెళ్లేవారి సంఖ్య తగ్గింది. పూర్తిగా పోయిందని కాదు. ఇంకా గణనీయసంఖ్యలోనే జనం వెడుతున్నారు. దీనికి కారణం పరిష్కారాలు అసలే అందుబాటులో లేకపోవడం. ఒక జంటకు పిల్లలు పుట్టరు.

డాక్టర్ల దగ్గరకు వెళ్లడానికి నామోషి. వెడితే గిడితే అమ్మాయి వెళ్లాలి కానీ మగరాయుడు పోడు. సంప్రదాయకంగా వస్తున్న సామాజిక వెనుకబాటు ఆలోచనా విధానం అందుకు అనుమతించదు. ఆ అమ్మ చెంగుపట్టుకుని దగ్గరున్న సోములోరి దగ్గరకు వెడుతుంది. అమ్మాయికి పెళ్లికాదు, అబ్బాయికి ఉద్యోగం రాదు. ఇదిగో నేను పరిష్కారమివ్వగలను అని చెప్పగలిగిన పరిస్థితి ఉండదు కదా! సోములోర్లు అభౌతికులు కాబట్టి వారు దేన్నైనా పరిష్కరించగలమని చెపుతారు. పాలస్తీనా, కశ్మీర్ సమస్యలను ముందుపెట్టినా పరిష్కరించగలిగినంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తమ జ్ఞానం కంటే ఎదుటివాడి అవసరం బలీయమైనదని వారికి తెలుసు. ఏ కేన్సరో వస్తుంది. ఏ మూడో ఫేజ్‌లోనో నాలుగో ఫేజ్లోనో గుర్తిస్తారు. ఏం చేస్తారు? భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని దేశంలో ఉన్న చాలారకాల సామాజిక వాతావరణాలకు ముడిపెడుతూ మేధావులు విశ్లేషిస్తూ ఉంటారు. ఖర్మానికి వదిలేసి ఎవరూ ఉండరు. నిస్సహాయులుగా ఉన్నవారు కనిపించిన రాయికల్లా మొక్కుతారు. రాయి నేనూ ఒకటే అని చెప్పుకునే స్వాములకు మొక్కుతారు.

వీటన్నింటికి పరాకాష్ఠ మూత్రం బాబా ఉదంతం. మనం జూస్ తీసుకుని వెడితే అతగాడు అదే పనిగా తాగేస్తూ అదే పనిగా మూత్రం పోసేస్తూ ఉంటాడు. అంతా పబ్లిక్కే! పారదర్శక వైద్య విధానం! ఆయనకూ పేటెంట్ హక్కు ఉన్నట్టే! వెళ్లిన వారు అదే పనిగా గ్లాసుల్లో అతని మూత్రం పట్టుకుని తాగేస్తూ ఉంటారు. ఈ మూత్రం బాబా దగ్గరకు కార్లలో కూడా భక్తులు వెడుతుంటారు. నిస్సహాయుల డెస్పరేషన్‌కి అతనొక సూచిక. ఇందులో ఆరోగ్యవ్యవస్థ వైఫల్యమూ ఉన్నది. అది పరిష్కరించలేని అంశాలూ ఉన్నాయి. కేవలం జ్ఞానాన్ని పంచడం వల్ల అన్ని విషయాలు పరిష్కారం కావు. ఈ నిస్సహాయ స్థితిలో జనాలు ఉన్నంత కాలం, దాన్ని క్యాష్ చేసుకునే వారు ఉంటూనే ఉంటారు.

మళ్లీ బత్తినవారి విషయానికే వస్తే ఆయన చేపమందు తినడానికి వచ్చేవారి సమస్యల గురించి, వారి హక్కుల గురించి అంత ఎక్కువగా పట్టించుకోవడం మన శక్తిని వృధా చేసుకోవడమే. ఉబ్బసం వ్యాధికి సరైన మందులు అందుబాటులోకి వస్తే వచ్చేవారి సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఆరోగ్యసాధనాలు పెరిగితే అందరికీ అందుబాటులోకి వస్తే సోములోర్ల హవా కూడా తగ్గుతుంది. విజ్ఞాన ప్రచారం మంచిదే కానీ ఏదో ఒక్క విషయం మీద కచ్చగట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనిపించుకోవాల్సిన అవసరంలేదు. పాము మంత్రం పనిచేయదన్న ప్రచారం కంటే పాముకాటుకు విరుగుడు మందులు అందుబాటులోకి రావడం సరైన పరిష్కారం అని చరిత్ర నిరూపించింది.
(15.6.13న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)

1 comment:

  1. ఇప్పటికీ చాలా గ్రామాల్లో సాములోర్లు తమ వైద్య విన్యాసం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మా ఊరిలోని ఓ సాములోరు వైద్యం చేసినందుకు డబ్బుతీసుకోడుగానీ... మాంచి నాటుకోడి పుంజును తీసుకుంటాడు. అలా ఆదివారం వచ్చిందంటే ఆయనకు ఓ ఐదారు కోడిపుంజులు గిట్టుబాటౌతాయి.
    రాయలసీమలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ మందుల షాపులు కూడా ఉండవు. అందుకే... జ్వరమొచ్చినా... పాముకరిచినా.. కామెర్లొచ్చినా ఇలాంటి నాటు వైద్యులే దిక్కు. వీరు లేకపోతే.. తమ పరిస్థితి ఏమైపోను అని ఒక్కోసారి జనం తెగ బాధపడిపోతుంటారు. గ్రామాల్లో పదో తరగతి చదివిన వారిని ఆర్ఎంపీలుగా శిక్షణ ఇచ్చి వైద్యం చేయించినా ఎన్నో ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. కానీ ప్రభుత్వానికి వైద్యం గురించి ఆలోచించే తీరికేదీ.. ‍!

    ReplyDelete