Tuesday 13 December 2011

చివరి మనీషి!


తనతో విభేదించిన సంస్థను కూడా తన దారిలోనే నడవాల్సిన పరిస్థితి కల్పించిన వాడు బాలగోపాల్. వాస్తవానికి ఆయన్ను ఆ సందర్భంలో వ్యతిరేకించిన వారికి కూడా ఆయన చూపిన తోవ అవసరమైనదని గుర్తించక తప్పని స్థితి. కొన్ని సంస్థలు చేసే పనిని ఒంటి చేత్తో చేసి చూపారు.
గాంధీ గురించి ఐన్‌స్టీన్‌ అన్న మాటలు బాలగోపాల్‌కు కూడా వర్తిస్తాయి. ఇటువంటి మనిషి ఈ భూమ్మీద రక్తమాంసాలతో నడిచాడంటే నమ్మడం కష్టం. అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. జీవితాన్ని నమూనా చేసి వెళ్లిపోయినవాడు. అందులోనూ ఊహించుకోవడానికే భయమేసేంతటి ప్రమాణాలు నెలకొల్పి ప్రజా రాజకీయాల్లో ఉన్నామనుకునే వారిని కూడా ఇరుకున పడేసి వెళ్లారు. మేధస్సులో ఆయనతో సాటిరాగల వారు అరుదు. ఆచరణలో చెప్పనక్కర్లేదు.
విడివిడిగానే ఆయన లోటును పూడ్చగలిగిన వారు కనుచూపు మేర లో కనిపించడం లేదు. ఇక రెండూ కలగలిసి ఆసాధ్యం. మేధాశ్రమ, శారీరక శ్రమ అని చాలా మాట్లాడుతుం టాం. ఆ రేఖలను జీవితంతోనే పూర్తిగా చెరిపేసినవాడు. ప్రతివారం ఆయన సగటున వేయి కిలోమీటర్లు పర్యటిస్తారు. దాదాపు అంతా బస్సుల్లోనే. ప్రభుత్వ బస్సుల్లో నే. హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి ఒకట్రెండు మినహాయిస్తే దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రాంతమైనా మన పక్కనే ఉన్న ఊరి గురించి చెప్పినంత సులభంగా రూట్లు, బస్సుల వేళల గురించి చెప్పగలడంటే ఆయన ఏ రీతిలో పర్యటించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఏ వేదిక మీదనైనా దానికి సంబంధించిన అంశం మీదే నిర్దిష్టంగా మామూలు మాటల్లో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం ఆయన లో ఉన్న ప్రత్యేకత. బహుశా తిరుగులేని స్పష్టత వల్లో తడుముకోవాల్సిన అవసరం కానీ ఉపన్యాసాన్ని ముందే రూపొందించుకోవలసిన అవసరం కానీ లేకపోవడం వల్లో ఆయన మాటల ప్రవాహ వేగం ఎక్కువ. అది జలపాతపు హోరు.
సెజ్‌లో భూమి పోతున్న రైతాంగంతో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రపంచ బ్యాంక్‌ కుట్ర, రాజ్య స్వభావం వంటి పెద్దపెద్ద మాటల్ని కుమ్మరించరు. ఎందుకు పోతుందో, ఎవరికి పోతుందో స్పష్టంగా వివరిస్తారు. మానవహక్కుల కర పత్రాలు, బుక్‌లెట్లు దీనికి మంచి ఉదాహరణ. తెలుగు సీమ మీద కరపత్ర సాహిత్యానికి బాలగోపాల్‌ కూర్పు అది. గతంలో బస్టాండుల్లో నిలబడి వివిధ సంస్థల వారు కరపత్రాలు పంచుతున్నప్పుడు- వరిబీజం… కరపత్రాలలాగే – ఒక సెకన్‌ అలా చూసి విసిరిపారేసే వారు ఎక్కువ మంది.
ఎత్తుకోవడం ఎత్తుకోవడమే పీకల్లోతు కూరుకుపోయిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని భయపెడితే ఏదో వింత భాష అనుకుని అలా పడేయడం సహజం. సానుభూతి పరుల విషయం వేరే. వాళ్ల కోసం కాదు కదా కరపత్రాలు, ఉపన్యాసాలు!ఇంకోవైపు ఆయన సిద్ధాంతంలో ఖాళీలను వెతుకుతూ వాటిని సవ్యంగా పూరించడం గురించి ఆలోచించేవారు. ఈ నేలకు ఈ మట్టికి ఈ నెత్తుటికి సరిపడదగినదేదో కనుగొనాలనే అన్వేషణ ఉండింది. దీనికి సంబంధించి నిరంతరం శ్రమిస్తున్న-నోట్స్‌ రాసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి.
ఈ పని పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. తొంభయవ దశకం మొదట్లో అయిలయ్య లాంటి వారు కులాన్ని కొసదాక తీసుకెళ్లి మాట్లాడుతున్నప్పుడు నాబోటి పిల్లకాయలం ఎపిసిఎల్‌సిలో ఆయనపై ఒంటికాలిపై లేచేవారం. ఆయన చైనా వాల్‌లాగా అండగా నిలిచేవారు. అది ఆయన అభిప్రాయాలతో ఏకీభవించి కాదు. భిన్నత్వమనేదే లేకపోతే ఏకశిలా సదృశ మై సంస్థలు మొద్దుబారిపోతాయని. ఈ భిన్నత్వాన్ని కాపాడడానికి ఆయన చివరిదాకా ప్రయత్న పూర్వకంగా కృషి చేశారు.
తక్కువ మాట్లాడతాడు అంటున్నారు గానీ తక్కువ ఎక్కువ సంగతి కాదది. పలకరింపులుండవు. మాటలుంటాయి. అది తన ఇల్లు అనుకున్న వాడు వచ్చిన వారిని అతిథిగా చూస్తారు. అస్సలు అలా దేన్నీ సొంతమనుకోని వ్యక్తి ఆయన. వచ్చిన వారిని ఎప్పుడొచ్చారు, బాగున్నారా లాంటి మొక్కుబడి పలకరింపులేమీ ఉండవు. టీ పెట్టడానికి వెడుతూ నువ్వు తాగుతావు కదా అనైతే అడుగుతారు. అవసరాన్ని బట్టే మాట. కొన్ని రోజులు ఆయనతో గడిపిన వారికెవరికైనా ఆయనెంత హస్యప్రియుడో అనుభవమే.
కాశ్మీర్‌కు స్వాతంత్య్రమంటూ వస్తే తొలి ఉన్నతమైన అవార్డు బాలగోపాల్‌ కే అని అక్కడి హక్కుల సంస్థ నేత పర్వేజ్‌ ఇమ్రోజ్‌ లాంటి వారు అనేవారంటే, ఆయన చనిపోయిన రాత్రి మరో హక్కుల నేత కుర్రం పర్వేజ్‌ ఫోన్‌లో ఘెల్లుమన్నారంటే ఆయన కృషి ఎంత విస్తారమైందో ఎన్ని చోట్ల ఎందరి గుండెల్ని తడిమిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రాష్ట్రంలో తన కృషి వల్ల ఎన్ని వేల ప్రాణాలను కాపాడాడో, ఎందరికి ఆయనున్నాడు కదా అనే ధైర్యమిచ్చా డో చెప్పడం కష్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీనిమీద ఆయన అభిప్రాయమేమిటో అనే ఆసక్తి అందరికీ ఉండేది.
పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక సంస్థల్లోని వారందరికీ ఆయన కన్సైన్స్‌ కీపర్‌గా ఉండేవారు. అన్ని స్రవంతుల వారికి ఒక అర్థంలో మీటింగ్‌ పాయింట్‌గా ఉండేవారు. మానవ హక్కులంటే నక్సలై ట్‌ ఉద్యమానికి పరిమితమైన వ్యవహారమనే ప్రచారాని కి భిన్నంగా వాటిని సమగ్రంగా నిర్వచించి ఆచరణలో చూపించి తనతో విభేదించిన సంస్థను కూడా తన దారిలోనే నడవాల్సిన పరిస్థితి కల్పించా రు. వాస్తవానికి ఆయన్ను ఆ సందర్భంలో వ్యతిరేకించిన వారికి కూడా ఆయన చూపిన తోవ అవసరమైనదని గుర్తించక తప్పని స్థితి. కొన్ని సంస్థలు చేసే పనిని ఒంటి చేత్తో చేసి చూపారు.
అధ్యాపక ఉద్యోగాన్ని వదిలేసి… అని కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆయన గణిత శాస్త్రంలో కృషి కొనసాగించి ఉంటే నోబె ల్‌ గ్యారంటీ అని నిపుణులే అన్న సందర్భాలున్నాయి. ఒక్క కెరీరెమిటి? వదులుకోనిదేమిటి? రుచిని జయించాడు. అలసటను జయించాడు. నిద్రను జయించా డు. నొప్పిని కూడా జయించాడు. భయ మూ భక్తీ బొత్తిగా లేవు. శరీరాన్ని కూడా పూర్తి స్థాయిలో జయించాలనుకున్నాడు.
అది చెప్పిన కంప్లయింట్స్‌ వింటూ ఉంటే రోజూ చెపుతూనే ఉంటుం ది అని ఆయన భావన. శరీరాన్ని థర్డ్‌ పర్సన్‌గా చూడాలని ఆయన అభిప్రాయం. పుచ్చలపల్లి సుందరయ్య ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే నీ శరీరంపై హక్కు నీకు మాత్రమే ఉండదు అని తీర్మానం చేసి మరీ పార్టీ సంరక్షించేదని ఎవరో చెప్పారు. ఆ రకమైన పని ఎవరమూ చేయలేకపోయాం. ఇప్పుడు కుములుతున్నాం.
జి ఎస్‌ రామ్మోహన్‌
(2009 అక్టోబర్‌ 14న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

No comments:

Post a Comment