Friday 23 December 2011

పాత్రికేయ స్వామిజీకి ప్రేమలేఖ


టైమ్స్‌నౌ చానల్‌సంపాదకులు అర్ణవ్‌గోస్వామి గార్కి,
మీరు  పౌరహక్కుల సంఘాలను నిలదీసిన విధానం భలేభలే. హక్కులంటే కేవలం ఉద్యమకారుల వేనా అన్న పాత ప్రశ్నను కూడా సరికొత్త ఆవేశంతో గొంతులోంచి ఎగజిమ్మగల నేర్పరులు మీరు. వేర్‌ ఆర్‌యు హిపోక్రాట్స్‌అని గాయంలో సీతారామశాస్ర్తిలాగా నిగ్గదీసి అడగడం మీడియాలో మీకే సాధ్యం. శ్రీనగర్‌లో బంద్‌పాటించనందుకు తారిఖ్‌భట్ అనే దుకాణదారుడిని బ్యాట్‌లతో కొట్టి చంపడం దుర్మార్గమన్న మీ వాదనతో విభేదించేవారు భారత్‌లోనే కాదు, ఎక్కడైనా ఉంటారని అనుకోలేం. కానీ వాస్తవాలను రిపోర్ట్‌చేయడం అనే పాతకాలపు జర్నలిజానికి పాతరేసి  మన అభిప్రాయాలను ఆవేశాలను తెరముందుకు తీసుకురావడం అనే మీ ఒరవడి ఉంది చూశారూ ఇట్స్‌సో చిల్లింగ్‌యార్‌! కశ్మీర్‌ దారుణాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌లోని సకల ఉద్యమాలను ఉద్యమ నాయకులను-ముఖ్యంగా హక్కుల సంఘాలను కడిగి పారేయాలనే మీ సంకల్పం రాజ్యమంత పురాతనమైనది. పాలకులు అమెరికాను అనుసరిస్తున్నపుడు మీడియా మాత్రం ఫాక్స్‌ను అనుసరించొద్దా! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయాలనడం ఏం న్యాయం! యూ ఆర్‌ఆల్వేస్‌ఆన్‌“రైట్‌’ సైడ్ బాస్‌!! కానీ అభిప్రాయమున్న ప్రతిమనిషికి మీలాగా కెమెరాలో మూతిపెట్టి గట్టిగా మాట్లాడే అవకాశమొస్తుందా చెప్పండి. అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు. మైకులు అందరికీ ఉండవు. మూతులందరికీ ఉండొచ్చు. కెమెరాలు అందరికీ ఉండవు. మొన్నామధ్య కరీంనగర్‌లో దళిత మహిళలు వండిన మధ్యాహ్న భోజనాన్ని తినబోమని పెద్దకులాల పిల్లలు భీష్మించారండీ. తాను ఇచ్చిన ప్లేట్‌ను తినకుండా పిల్లలు తిరస్కారభావంతో వెళ్లిపోతే ఆ దళిత తల్లి కంట్లో కదిలిన కన్నీటి పొరను వ్యక్తీకరించే కెమెరాలు లేవండి. ఆ కన్నీటిపొరకే శక్తి ఉంటే ఈ దేశంలో కులమనే అశుద్ధం కొట్టుకుపోవాలి సర్‌! ఆ కంటిచూపుకే శాపమిచ్చే శక్తి ఉంటే ఆ ఆగ్రహంలో కుల అహంకారులు ఊడ్చుకుపోవాలి సర్‌! కానీ ఈ దేశపు దేవుళ్లు శాపాలిచ్చే అర్హతలు కూడా కొందరికే ఇచ్చి జాగ్రత్తపడ్డారు సర్‌! మీకు బాగా తెలుసుసర్‌! యునో...ఇనో స్వామిజీ...యునో! మీకు ఆవేశం తప్పించిన కశ్మీర్‌దగ్గరకే వద్దాం సర్‌! కశ్మీర్‌లో నాలుగేళ్ల బాలుడిపై బాంబు దాడి కేసు పెట్టినపుడు ఇదేమి అన్యాయమని ఆక్రోశించిన వారికి కెమెరాల సదుపాయం లేదు. వందల కొద్దీ యువకుల మిస్సింగ్‌వ్యవహారాల్లో ఆ తల్లుల కడుపు కోత పంచుకోవడానికి సరిపడా మైకుల్లేవు. గార్డెన్లకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్‌లో ఆనవాళ్లు లేని సమాధుల తోటలున్నాయి కదా! ఆ వేలాది శవాలు ఎవరివో ఎందుకున్నాయో అందులో మిస్సింగ్‌పిల్లలెంత మందో తేల్చే దిక్కులేదు.  మీరెప్పుడైనా శ్రీనగర్‌దాటి పల్లెలకు వెళ్లారా..వెళ్లే ఉంటారు సర్‌!  భూసంస్కరణలు పటిష్టంగా అమలైన ప్రాంతం కశ్మీర్‌అని మీబోటి పెద్ద జర్నలిస్టులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగాల్‌ కూడా కశ్మీర్‌తర్వాతే. అదంతా షేక్‌అబ్దుల్లా చలువండీ. చిన్నచిన్న కమతాలుసర్‌.....రైతులెక్కువ సర్‌! ప్రతిరైతు తన ఊరినుంచి పొలానికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు జవాన్లచేత తడిమించుకుని వెళ్లాలి కదా సార్‌...అక్కడ ఎన్ని కళ్లు ఆ రైతు కుటుంబాలలోని స్ర్తీలను కళ్లతోనే రేప్‌చేస్తాయో తెలుసా సర్‌! నిజమైన రేప్‌ఆరోపణల గురించి మాట్లాడబోవడం లేదు సార్‌! 'ఆర్మీని డీ మోరలైజ్‌చేసే విదేశీ కుట్రలోనూ మరియును దేశద్రోహం'లోనూ పాలుపంచుకోవాలని లేదు సార్‌! మనింట్లోంచి మనం బయటకువెళ్లినపుడు వచ్చినపుడు మనల్ని  శత్రువు  దృష్టితో చూసే జవాన్‌చేత ఒళ్లంతా తడిమించుకోవడమనే అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సర్‌! అన్నట్టు ఇపుడూ జవహర్‌లాల్‌నెహ్రూ అనే పెద్దమనిషి ఉన్నాడు కదా సర్‌! ఆయన శ్రీనగర్‌లాల్‌చౌక్‌దగ్గర ఒక ఉపన్యాసం ఇచ్చాడు సర్‌! "భారత దళాలు ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. కశ్మీరీలు భారత్లో కలిసి పోతారా..పాకిస్తాన్‌లో కలుస్తారా...ఎలా ఉండాలనుకుంటారు అనే స్వయంనిర్ణయాధికారం వారికే ఉంటుంది. వారు కోరినపుడు ప్లెబిసైట్‌నిర్వహిస్తాం'' అని బహిరంగంగా చెప్పారు కదా సర్‌! ఆ ఉపన్యాసం ఇపుడు ఇంటర్‌నెట్‌లోంచి తీసేశారు సర్‌! అలా తీసేయడం పౌర స్వేచ్ఛకు ప్రజాస్వామిక వాతావరణానికి భిన్నమని మీకు అనిపించలేదు కదండీ ! మీరు పెద్ద ఎడిటర్‌కదా సర్‌! ఆ ఉపన్యాసం ముందే విని ఉంటారు. చూసే ఉంటారు. తొలి ప్రధాని చెప్పిన మాటలను ఎవరైనా గుర్తుచేస్తే వారు ఉగ్రవాది అవుతారాండీ! ఉగ్రవాదులకు ఊతమిచ్చే దేశద్రోహులవుతారా స్వామిగారూ! నెహ్రూగారి కుమార్తె ఇందిర కశ్మీరీలతో సంబంధం లేకుండా పాకిస్తాన్‌తో చేసుకున్న సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడితే దేశభక్తులైపోయి ఆమె నాన్న నెహ్రూ కశ్మీరీలకిచ్చిన హామీ గురించి మాట్లాడితే దేశద్రోహులైపోవడం ఎంత చిత్రమండీ!   చచ్చిపోయిన తర్వాత అంతటి  పెద్దమనిషి మాటలను అంతటి స్వాతంత్ర్యపోరాటయోధుడి మాటలను అంతటి స్టేట్స్‌మన్‌మాటలను పాటించకపోవడం పాపం ఆయనకు అన్యాయం చేయడమే కదండీ...బతికి లేడుకదా అని ఆయన హామీని బుట్టదాఖలా చేయడం తగునా సుమండీ....అరుంధతీరాయ్‌ ఏం కోరారండీ...నెహ్రూను గౌరవిద్దామని ప్రయత్నించారండీ! తప్పాండీ! ఎక్కడ కానిస్టేబుల్‌నక్సలైట్ల చేతుల్లో చచ్చిపోయినా, ఎక్కడ కశ్మీరీ పండిట్లకు చిన్నపాటి అన్యాయం జరిగినా మీరు వాట్‌అరుంధతీరాయ్‌అని ప్రశ్నిస్తూ ఉంటారు కదండీ.! మేధాపట్కర్‌, బినాయక్‌ సేన్‌, సుజాతో భధ్రో లాంటివాళ్లందరినీ ఉద్దేశించి వాట్‌హిప్పోక్రాట్స్‌అంటూ ఉంటారు కదండీ! నాకు తెలిసీ వాళ్లెవరనీ చంపినోళ్లు కాదండీ! పైగా పువ్వులూ పిట్టలూ చెట్లూ అని కవిత్వం కూడా చెప్పేయగల కాల్పనిక జీవులండీ! ఉద్యమాల నాయకులు జైళ్లో ఉన్నపుడు కూడా ఆదాహై చాంద్‌మా అని పాడుకోగలిగిన సున్నితమైనోళ్లండీ! ఇదంతా ఉద్యమాల సానుభూతిపరుల వాచాలత్వం అనిపించొచ్చండీ! కానీ సుధీంద్ర కులకర్ణి కోబాడ్‌గాంధీ గురించి ఏం రాస్తున్నారో చూడండి సార్‌! కులకర్ణి అయితే ఉద్యమాల సానుభూతిపరుడు కాదుకదండీ! ఆయన బిజెపి నాయకుడని తెలుసుకదండీ! మనుషులను అర్థం చేసుకోవాలంటే మనసును పట్టుకోవాలి సార్‌! కానీ మీ కెమెరాకు మొకమూ ఇంకోటి తప్ప మనసు తెలీదు కదా సర్‌! హే హిప్పోక్రాట్స్‌పండిట్స్‌సంగతేంటి అని మీరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా సర్‌!  పండిట్ల గురించి కశ్మీర్‌లో చిన్నా పెద్దా నాయకుడిని ఎవరిని కదిలించినా సారీ ఫేస్‌పెడతారు, తలవంచుకున్నట్టు ఫీలవుతారు తప్పితే ఎవరూ ఘనకార్యం అనుకోరు సర్‌! మనుషులు కదండీ!
       మీరు ఒంటికాలిమీద లేచే పౌరహక్కుల నేతలు ఏమంటారు? బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ఏమంటారు! పౌరులు నేరాలు చేస్తే నియంత్రించడానికి రాజ్య వ్యవస్థ ఉంది. ఇపుడు శ్రీనగర్‌లో బ్యాట్‌తో కొట్టి చంపిన ఘటనలో నేరస్తుల పని పట్టడానికి వ్యవస్థ ఉంది. వారా పని చేయాలి. కానీ రాజ్యమే నేరం చేస్తే ఎవరినడగాలి? మన కిష్టం లేని వాళ్లను కాల్చి చంపడానికి స్ర్తీలమీద అత్యాచారాలు చేయడానికి వారికి పర్మిషన్‌ఇస్తే ఏమవుతుంది? అది ఎక్కడికి దారితీస్తుంది? పాలనా వ్యవస్థ అంటే  మనుషులే కదా సర్‌! వారికి కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా సర్‌! ఒకసారి వారికి అవసరంలేని అధికారాలు కట్టబెడితే  ఎవరినైనా బలితీసుకోవచ్చు. అది ఇవాళ నీకు ఇష్టం లేని సమూహం కావచ్చు. రేపు నువ్వే కావచ్చు. ఈ మాటలేవీ కొత్తవి కావు. భూమి పుట్టినప్పటినుంచి హక్కుల నాయకులు చెపుతూనే ఉన్నారు. ప్రజలు తమకు అవసరమైన డిమాండ్ల కోసం ఉద్యమించి నపుడు వారి ఆకాంక్షలను పట్టించుకోకుండా హింసతో అణిచివేయడం వల్ల వారికి  ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని అది మరింత హింసకు దారితీస్తుందని ఉద్యమకారులు హెచ్చరిస్తుంటారు. అంటే వారు ప్రజాస్వామ్యానికి అవసరమైనవారూ ప్రియమైన వారూ అన్నమాట. కానీ మీలాగ ఒక బాక్సైట్‌ప్రాజెక్టు ఒక కుదంకుళం ప్రాజెక్టు మందగిస్తే వెంటనే ప్రజాస్వామ్య వ్యవస్థ  బ్రాండ్‌ఇండియాను దెబ్బతీస్తోందా( ఈజ్‌డెమొక్రటిక్‌పాలసీస్‌ఇంపాక్టింగ్‌బ్రాండ్‌ఇండియా-టైమ్స్‌నౌ- టైమ్స్‌ఆఫ్‌ఇండియా వెబ్‌సైట్‌లో చర్చాంశం. పోల్ నిర్వహించుచున్న అంశం)అని ప్రజాస్వామ్యంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేయలేదు.  ప్రజాస్వామ్యం వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని నిందిస్తే ఇక మీరు ఏంకావాలని కోరుకుంటున్నట్టు? ఆ రకంగా మీరు నిందిస్తున్న హక్కుల సంఘాల వారు  ప్రజాస్వామిక వాదులా?మీరు ప్రజాస్వామిక వాదులా సర్‌? ఏమిటో సర్‌! ప్రజాస్వామ్యం లాగే అంతా మిధ్య?
జి ఎస్‌రామ్మోహన్‌

No comments:

Post a Comment