Monday 6 February 2012

అన్నా ఉద్యమం-ఆంతర్యాలు


అన్నా ఉద్యమం వల్ల సామాజిక అసమానతలు తగ్గుముఖం పడతాయా...మనూరి కనీస్టీబు బాడీ లాంగ్వేజ్ మారుతుందా...భూమి లేనోడికి భూమి దక్కుతుందా...ఇవేవీ కావు కాబట్టి అది ఉత్తిదే అనడం ఒక పద్ధతి. ఇవేవీ కావు కాబట్టే అది మహోద్యమం, మరో స్వాతంత్ర్యపోరాటం అనడం మరో పద్ధతి. అవేవీ కాకపోయినా అన్నా ఉద్యమం కదలిక తీసుకువచ్చిన మాట వాస్తవం. ఆయన సైతం ఊహించని విధంగా మద్దతు వచ్చిన మాట వాస్తవం. అయితే ఇది ఈ దేశంలోని సామాన్యుడి ఉద్యమం కాదు, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ఉద్యమం. 90ల దాకా ఉన్న వ్యవస్థ మధ్యతరగతిని అవినీతికి ప్రోత్సహించింది. అవినీతి ఇంతగా ఊడలు పాతుకుపోయేలా చేసింది ఈ దేశంలోని మధ్యతరగతే. వారు టిటిఇకి యాభై ఇచ్చి సీటు కన్‌ఫర్మ్‌ చేసుకోగలరు. తెలిసిన నాయకుడిని పట్టుకుని ఏదో ఒక ఉద్యోగం తన సంతానానికి సాధించగలరు. నాలుగైదు లక్షలిచ్చి నాలుగు రాళ్లు దొరికే చోటికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోగలరు. ఆధిక్యతను ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండిన కాలమది. ఈ ఇరవై యేళ్లలో వచ్చిన మార్పులు మధ్యతరగతిని పెంచేశాయి.  టిటిఇకి యాభై వంద ఇవ్వగలిగిన భద్రలోక్‌ సమాజం పెరిగింది. మధ్యతరగతిలోనే అనేక లేయర్స్‌ వచ్చాయి. ఓ మోస్తరు పట్టణంలో నెలకు 20 వేలు వచ్చేవారు మధ్యతరగతి అయితే హైదరాబాద్‌ లాంటి సిటీలో నెలకు 50, 60 వేల జీతగాళ్లు కూడా మధ్యతరగతే. సంఖ్య పెరిగాక ప్రివిలేజ్  పనిచేసే స్థితిని కోల్పోతుంది. అవకాశం కొద్దిమందికి ఉన్నపుడే అది ప్రివిలేజ్ అనిపించుకుంటుంది. దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పట్లో ఏదైనా గవర్నమెంట్‌ ఆఫీస్‌లోకి వెళ్లి ఇంగ్లిష్‌లో మాట్లాడితే అక్కడున్న వారు కాసింత అటెంటివ్గా వినే పరిస్థితి ఉండేది. ఇవాళ కూడా ఎల్లన్న మల్లన్నల కంటే కూసింత మర్యాదిచ్చే పరిస్థితి ఉన్నా గతంలో ఉన్నంత ప్రివిలేజ్‌ లేదు. అక్కడ కూర్చున్నవారు కూడా అంతకంటే ఘాటుగా ఇంగ్లిష్‌లో బదులివ్వగలరు. అన్ని ఆఫీసుల్లో ఆ తరం వచ్చేసింది. అదొక్కటే కాకుండా ప్రైవేటైజేషన్‌ కూడా ప్రివిలేజెస్ రూపాలను మార్చేసింది. ప్రభుత్వ యంత్రాగం నుంచి సేవలను పొందే విషయంలో 90లకు ముందున్న ఆధిక్యత ఇవాళ మధ్యతరగతికి లేదు. ప్రభుత్వ సేవలు  కుచించుకుపోయాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్‌, ఇంటి నిర్మాణ అనుమతులు వంటివి మినహాయిస్తే మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతికి ప్రభుత్వ యంత్రాంగంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. రోజువారీ సంబంధాలు అయితే అసలే లేవు.
       సాధారణంగా  కింది వాళ్లు ఏదో ఒక నిచ్చెన వేసుకుని తమను అందుకోవాలని చూసేలోపు అభివృద్ధిలో ముందున్న వాళ్లు తమ ఆధిక్యతను కాపాడుకోవడానికి ఇంకేదో రూపాన్ని ఎంచుకుంటారు. 90లకు ముందు ప్రభుత్వ ఉద్యోగాలే సర్వస్వం అయిపోయిన దశలో అప్పటికే ఎదిగిన వారి ఆధిపత్యం ఉండేది. ఉన్నత స్థానాల్లో వారి హవా నడిచేది. రిజర్వేషన్ల వల్ల , ఉన్నత విద్య వల్ల మిగిలిన కులాలవారు కూడా వారి సరసన కూర్చునే పరిస్థితి వచ్చేసరికి వారు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించేశారు. పాలనా యంత్రాంగంలో ఇంకా తమ పట్టే సాగుతున్నది కాబట్టి వారి సాయంతో డబ్బు ఊరబెట్టుకునే ప్రైవేట్‌ మార్గం చూసుకున్నారు. ప్రభుత్వ యంత్రాగంలోని అవినీతితో విసిగిపోయి ఉన్నందున రానున్న ముప్పును గుర్తించే పరిస్థితి లేనందున పెద్ద వ్యతిరేకత కూడా రాలేదు. సామాన్యుడికి అత్యవసరమైన రెండు రంగాలను వారికి దూరం చేశారు. అవి ఆరోగ్యం, విద్య. రెంటిలోనూ సెక్లూజివ్‌ విధానాలను అవలంబించి ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పథకం ప్రకారం నాశనం చేయగలిగారు. అయినా సరే అప్పటికే ఏదో విధంగా పట్టణాల్లో ప్రవేశించిన కింది వర్గాలు నెమ్మదిగా అభివృద్ధి నమూనా రహస్యాన్ని అర్ధం చేసుకోగలిగాయి. గ్రామీణ వాతావరణం నుంచి బయటపడి ఏదో రూపంలో తమ సంతానాన్ని విద్యాధికులను చేయగలిగిన వారు మధ్యతరగతిలో చేరిపోయారు. ముఖ్యంగా ఐటి, ఫార్మా, టెలికం లాంటి రంగాలు పూర్తిస్థాయి కార్పోరేట్ రూపం సంతరించుకున్నాయి. ఇవి దేశంలో మధ్యతరగతిని పెంచాయి. దారుణంగా నష్టపోయింది గ్రామీణ వర్గాలే. సో ఏమైతేనేం ప్రపంచీకరణ ఫలితంగా గుర్తించదగిన సంఖ్యలో దిగువతరగతి మధ్యతరగతిగా మారిన మాట వాస్తవం. మరింత మందికి ఆశలు రేకెత్తించిన మాట వాస్తవం. వేతన జీవుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. మధ్యతరగతికి అంతకు ముందు వలె ప్రివిలేజెస్‌ను ప్రదర్శించుకోవడానికి అవకాశాలు తగ్గిపోయిన మాట కూడా వాస్తవం. ఇదే సమయంలో ప్రైవేట్‌ పెట్టుబడి 90ల తర్వాత రియల్‌ ఎస్టేట్‌, భారీ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో విశ్వరూపం ప్రదర్శించడం మొదలెట్టింది. ప్రభుత్వ సొమ్మును అంతకుముందు ఎన్నడూ  ఊహించని స్థాయిలో దోచుకోవడానికి ఇవి మార్గం చూపాయి. సాధారణ అవినీతి స్థానే వందలు వేల కోట్ల అవినీతి నిత్యకృత్యంగా మారింది. అవినీతి కేంద్రీకృతమైంది. అధికారం అక్రమార్జనకు రాజమార్గంగా మారింది. ఎన్నికల వేళలో పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి పరిమితమైన పారిశ్రామికవేత్తలు నేరుగా అధికారంలో జొరబడి తిష్టవేశారు. విభజన రేఖ చెరిగిపోయింది. రాజకీయ రంగం ఇతర రంగాలనుంచి ప్రధానులను, రాష్ర్టపతులను అరువుతెచ్చుకునే దశ వచ్చేసరికి అదెంత వల్నర్‌బుల్‌ పరిస్థితిలో ఉందో కార్పోరేట్‌ సార్లకు అర్థమైంది. తాము నేరుగా జొరబడొచ్చనే ధైర్యం పెరిగింది. ఒక దశలో అయితే కంపెనీలను లాభాలబాటలో నడిపించే వారు దేశాన్ని కూడా నడిపిస్తారని ఇన్ఫోసిన్‌ నారాయణమూర్తి లాంటివారికి దేశాన్ని అప్పగించాలనే అసహ్యకరమైన వాదనలను కూడా ధైర్యంగా ముందుకు తేగలిగారు. చట్టసభలు కార్పోరేట్‌ బోర్డు రూములుగా మారుతున్న కాలమిది. ఒక్కో బిజినెస్‌ టైకూన్‌ కొంతమంది ఎమ్మెల్యేలను తన ఖాతాలో ఉంచుకోవడం తన రాజకీయ అవసరాలకనుగుణంగా వారిని చట్టసభలో ఉపయోగించుకోవడం అనేధోరణి పెరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఏడేడు తరాలకు ఫర్వాలేదు అనిపించే కాలమిది.  ఓ వైపు తమ కళ్లముందే కొంతమంది వందలు వేలకోట్లకు పడగలెత్తుతా ఉంటే తాము అలా మిగిలిపోవడమనే అసంతృప్తి వేతన జీవుల్లో పెరిగింది. వేల రూపాయల వేతనజీవులను ఎసిబి పట్టుకుంటూ ఉండడం అవి టీవీల్లో కనిపించడం, అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీ హుజూర్‌ జాతికి చెందిన కొందరు ఐఎఎస్‌ ఐపిఎస్‌లు కుబేరులుగా మారి రొమ్ము విరుచుకుంటూ తిరగడం  అనేది కళ్లముందు కనిపిస్తూనే ఉంటుంది. కడుపు మండమంటే మండకుండా ఉంటుందా!
        ఇదొక్కటే కాదు. పాలకులు ఎన్నికల సమయాల్లో ఇచ్చే వరాలు చూసినా మధ్యతరగతికి కడుపు మంటగానే ఉంటుంది. అదేంటి ఈ కాలంలో కూడా రెండు రూపాయలకు కిలోబియ్యం ఏమిటి? టీవీలివ్వడమేమిటి? ఫీజులు ఉచితంగా ఇవ్వడమేమిటి? వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడమేమిటి? ఇన్ని సబ్సిడీలేమిటి?  అని అనర్గళంగా వారు ప్రశ్నించగలరు. ఎల్‌పిజి సిలిండర్‌ మీద ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో వారు గుర్తు చేసుకోరు. వారెక్కే విమానం ఇంధనంపై ప్రభుత్వం వారు ఎంత సబ్సిడీ ఇస్తారో చెప్పరు. పారిశ్రామిక వేత్తలకు ఎన్ని వేల కోట్ల టాక్స్‌ హాలీడేలిస్తారో చెప్పరు. బ్యాంకులు నాన్‌ ఫెర్మార్మింగ్‌ ఎస్సెట్స్‌ కింద ఎన్ని వేల కోట్లు కొట్టివేస్తాయో చెప్పరు. ఇవన్నీ చెపితే అవి పేదలకు ఇచ్చే సబ్సిడీలకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్పారు. ఆ హమీలు సరైనవని పేదరికాన్ని పారదోలతాయని కాదు. చేపలు పట్టే విధానం నేర్పకుండా అపుడపుడు కొన్ని చేపలు విసిరి వారిని బిచ్చగాళ్లుగానే ఉంచడమనే కుట్ర ఉందిందులో. కాకపోతే మధ్యతరగతి కోపం అందుక్కాదు. ఏదో దోచిపెడుతున్నారనే దుగ్ధ.  ఏదేమైనా మధ్యతరగతికి ఇవాళ రెండు రకాల కోపాలున్నాయి. అది తాము  బుద్ధిగా టాక్స్‌ కడుతూ ఉంటే పాలకులు, కాంట్రాక్టర్లు దోచేస్తున్నారు అనే ఆగ్రహం. పశ్చిమదేశాల్లో వలె మనదేశంలోనూ ఇకముందు తారకమంత్రంగా మారగల పదబంధం టాక్స్‌ పేయర్స్‌ మనీ. కారణమేదైనా ఇది ధర్మాగ్రహం. రెండోది తాము చెల్లిస్తున్న మనీని ప్రభుత్వం పేదలకు ఉచిత వరాలపేరుతో వృధాచేస్తోంది అని. ఇది అధర్మాగ్రహం. అన్నా హజారే ఉద్యమానికి ఇన్‌స్టంట్‌ మద్దతులో కనిపించిందైతే ధర్మాగ్రహమే. కాకపోతే ఆ క్యాండిల్స్‌ విప్లవకారుల్లో ఎక్కువమంది కట్నం తీసుకుంటారు. కొనుగోళ్లు అమ్మకాల్లో కరెక్టు లెక్కలు చూపించరు. పాస్‌పోర్టు ఇంక్వైరీకి వచ్చిన కానిస్టేబుల్‌ను సంతృప్తి పరుస్తారు. ఉద్యమానికి గ్లామర్‌ యాడ్‌ చేసిన సినిమా తారల్లో ఎంత మంది తాము సినిమాకు తీసుకునే మొత్తాన్ని కాగితాలపై చూపిస్తారు?  ఇవేవీ వారికి అవినీతిలాగా అనిపించవు. అది అందరూ చేసేది, సామాజిక ఆమోదం ఉన్నదీ అని భావిస్తారు. కాబట్టి తాము చేసేది అవినీతి కాదని వేరేవారు చేసేది మాత్రమే అవినీతి అని భావిస్తారు. తాము భాగంలో కాని అవినీతిపైనే కోపం. తమకు భాగస్వామ్యం లేకపోవడం వల్లే కోపం. అందరూ అలా అని కాదు గానీ అన్నా ఉద్యమంలో కనిపించిన వారిలో ఎక్కువ ఇదే బాపతు. అయితే ఈ కోపం ఆ రూపంలో వ్యక్తం కాదు. కాలేదు.  సమూహంలోకి వచ్చినపుడు ఒక విలువను ముందుకు తెస్తారు. అవినీతి వ్యతిరేకత అనే సార్వజనీక విలువను ముందు పెడతారు. అక్కడ దీన్ని ప్రజాస్వామిక ఆకాంక్షగా చూడొచ్చు. వారి కోపానికి కారణమేదైనా వారు ముందు పెట్టిన డిమాండ్లో ఉన్న విలువ అవసరమైనది.  వారికి మాత్రమే కాదు. పేదలకు కూడా అవసరమైనది. సమాజంలో అవినీతి ఊడలు వేసుకుని పోవడం వల్ల ఎక్కువ నష్టపోతున్నది పేదలే. పార్లమెంటరీ ప్రజాస్వామిక అర్థంలో అయినా అందరికీ అవకాశాలు సమానంగా ఉండే స్థితి కోసం ప్రయత్నించడం కొందరు అడ్డదారుల్లో వాటిని ఎగరేసుకుపోయే స్థితిని అడ్డుకోవడం  సామాన్యునికి లాభమే. మౌలికమైంది కాకపోవచ్చు కానీ వారికి అవసరమైనది ఇది. కాకపోతే ఇలాంటి ఉద్యమాలతో అవినీతిని నిర్మూలించగలమనే నమ్మకం ఏదీ పేదలకు లేదు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే వారి భాష, బాడీ లాంగ్వేజ్ వారిని ఆకట్టుకునేవి కావు.
     ఇంతా జేసి అన్నా హజారే మంచి ఆరంభాన్ని చేజేతులారా కొంత వరకు పాడుచేసుకున్నారు. తాము ఆ కమిటీలో ఉండే బదులు  మార్గదర్శనాలేమైనా రూపొందించాలని పట్టుబట్టి ఉంటే కమిటీ నియామకం మరింత పారదర్శకంగా  ఉంటే బాగుండేది. అన్నా హజారే తనతో వేదికమీద ఉన్నవారితో కమిటీని నింపివేయడం వివాదాస్పదమైంది. కనీస మోడెస్టీ కూడా లేకుండా  తండ్రీకొడుకుల జంట శాంతి-ప్రశాంతి భూషణ్‌లు కమిటీలో కూర్చోవడం మరో విడ్డూరం. అన్నా గుర్తు చేసుకోవాల్సిన అంశం మరోటుంది. గాంధీ వేషం వేసిన వారందరి నుంచి త్యాగం అనే విలువను ఆశిస్తారు జనం. తాను స్వయంగా కమిటీలో లేకపోతే ఏదేదో జరిగిపోతుంది అనుకోవడం భ్రమ. కేవలం నిజాయితీనే ఒక విలువగా తీసుకుంటే భారత దేశంలో కొల్లలు కొల్లలుగా ఉన్నారు. పేరు గడించినవారూ ఉన్నారు, దానితో నిమిత్తం లేకుండా పనిచేసుకుపోయే వారూ ఉన్నారు. వారినందరినీ విస్మరించి ఒక పద్ధతి పాడూ కూడా లేకుండా ఏ ప్రాతిపదికన కమిటీ నియమించారంటే సమాధానం చెప్పుకోలేని స్థితికి తనను తాను చేర్చుకోవడం ఆయన చేసిన తప్పిదం. ఈ ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకుని ఆయన తన ప్రయత్నాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసికెళ్లగలిగితే దేశానికి మహోపకారం చేసినవారవుతారు.
                                                                                                    జి ఎస్‌ రామ్మోహన్‌
(5-7-2011 న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)

No comments:

Post a Comment