Thursday 14 April 2016

పీకె హై క్యా?


pk1
samvedana logo copy(1)పీకె గురించి. పీకె అంటే చంకల్లో సెగ్గడ్డలు వచ్చినట్టు చేతులు ఎగరేసి ఎగరేసి మాట్లాడే పీకె కాదు. ఆ పీకుడు మనకిప్పుడు అనవసరం. హిరానీ పీకె మాత్రం ఎందుకు అవసరం అంటే అది మన సమాజానికి అవసరమైన ఒక అంశాన్నిపరిమితుల్లోనైనా చర్చించగలిగింది. 300 కోట్ల వసూళ్లవైపు దూసుకెళ్తోంది అని చదివినప్పుడు కాదు గాని పీకె అంటే ఏమిటి అనేది ఐదో తరగతి పిల్లలు చర్చించుకుని చివరకు పాగల్‌ కుత్తా అని వాళ్లొక అబ్రివేషన్ ఇచ్చేసుకున్నారని తెలిశాక హిరానీ సక్సెస్‌ అయినట్టు అనిపించింది. పీకె సినిమాకు పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెట్టుబడి పెట్టిందని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించినపుడు భలే అనిపించింది. సిటీకొచ్చి ఇన్నేళ్లయినా దేడ్‌ దిమాక్‌ అంటే సరిగా తెలిసేది కాదు. ఇపుడే తెలిసింది. కొత్త ఆశ్చర్యాలు, కొత్త విషాదాలు లేని నిస్సత్తువ కాలంలో ఎంత వినోదం, ఎంత విషాదం?
పీకెలో కొత్త అంశాలేమీ లేవు. అన్నీ మనకు తెలిసినవే. అందులోనూ మనం నాస్తికులమో హేతువాదులమో కమ్యూనిస్టులమో అయిఉంటే ఎప్పుడో ఒకసారి ఆ జోకులన్నీ వేసే ఉంటాం.అవేవీ పూర్తిగా ఏలియన్‌ విషయాలు కావు. కోడలు దిద్దిన కాపురం నాటినుంచో ఇంకా అంతకుముందునుంచో అక్కడక్కడా అపుడపుడూ కొన్ని శకలాలు చూస్తూనే ఉన్నాం.
ఓ మైగాడ్‌తో కూసింత ఎక్కువే చూశాం. కాకపోతే హిరానీ అలాంటి ఎలిమెంట్స్‌ని పూర్తిస్థాయిలో మెయిన్‌స్ర్టీమ్‌ లోకి తెచ్చి అల్లిన తీరు కొత్తది. ఈ దేశంలో మనోభావాలు అనే పదం ఒకటి ఏడ్చింది. దేవుడు లాంటి అమూర్తమైన పదార్థం అది. అది ఎవరైనా ఏలు పెడితే బొక్కడిపోయేంత సున్నితము. అత్తిపత్తి వలె అలా తాకితే ఇలా ముడుచుకుపోయేంత సున్నితము. పీకెకు దేవుని రూపరేఖా లావణ్యములు తెలీనట్టే మనకూ ఈ మనోభావాలు అనేవి ఎలా ఉంటాయో ఎందుకంత సున్నితంగా ఉంటాయో తెలీదు. కాకపోతే ఒకటి తెలుసు. ఇతరుల మీద దాడులు చేసి చంపేసేవారు, త్రిశూలాలతో తల్వార్లతో ఊరేగేవారికే ఇట్లా సున్నితమైన మనోభావాలు ఉంటాయని చరిత్ర మనకు తెలుపుచున్నది.
ఒక ఆర్టిస్టును దేశం విడిచిపోయేట్టు చేసినవారు, ఆడపిల్లలపై విధించిన స్థలకాల ఆంక్షలను ధిక్కరించినందుకు-అంటే మగవారికి మాత్రమే పరిమితమైన రాత్రిపూట రోడ్లమీద తిరుగుట, పబ్బుల్లో క్లబ్బుల్లో కనిపించుట వగైరా చేసినందుకు దాడులకు పాల్పడువారు. వాలంటైన్స్‌ డేనాడు తిట్టి కొట్టి బలవంతపు పెళ్లిళ్లు చేయువారు. ఒక నవల రాసినందుకు తలతీస్తాం అని ఫత్వా విధించినవారు, పబ్లిగ్గానే దాడులు చేయగలిగిన వారు. వీరందరి మనోభావాలూ సున్నితమైనవే. ‘అరేయ్‌, నేను చాలా సున్నితమైనవాడిని, నాకు కోపం తెప్పిస్తే నరికేస్తానంతే’ బాపతుగాళ్లన్నమాట! ఇదిగో ఈ బ్యాచ్‌ ఇపుడు రోడ్డున పడింది. ఇలాంటివారితో డీల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.
pk1
ఇక్కడ చాలా నేర్పుగా జాగ్రత్తగా వ్యవహరించారు రాజూ హిరానీ. నేర్పుగా అంటే సబ్‌ ఠీక్‌ హై అని కాదు. సర్దుబాట్లే కాకుండా కొన్ని రాజీలు కూడా ఉన్నాయి. ఇంత జేసినా ఈ మనోభావాల గుంపులకు తృప్తి లేదు. ఊరుకుంటే మెత్తదనం అనుకుంటారేమో, పైగా మనోడు పదవిలో ఉన్నపుడు కూడా మనం హడావుడి చేయకపోతే మన ఆధిపత్యం ఏమైపోవాలి అని తీర్మానించేసుకుని బజార్న పడుతున్నారు. కడుపుకు అన్నం తినేవాడెవడూ ఇది మతాన్ని కించపరిచే సినిమా అనలేడు అని స్టేట్‌మెంట్‌ ఇవ్వచ్చుగానీ అన్నం బదులు చపాతీతింటే ఒకేనా అనొచ్చు.
అభిప్రాయాల్లో కూడా వైవిధ్యం ఉండొచ్చును. మన అభిప్రాయమే అంతిమం కావాలని   అనుకోకూడదు. విభేదాలున్నవారు రాసుకోవచ్చు. హిరానీ అనే పెద్దమనిషి ఒక సినిమా తీశాడు, నీకు నచ్చకపోతే ఇంకో సినిమా తీస్కో. లేదంటే ఒక వ్యాసంరాస్కో. నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. “నా చేతిలో కర్ర ఉండాది కాబట్టి అందరూ నా మాట వినాలనిపిస్తాది” అంటే ఏం బాగుంటాదప్పా! అని మనం అడగాల్నా వద్దా! ఒకవైపు ప్రజాస్వామ్యంఅంటావు. ప్రజాస్వామ్యం చాలా గొప్పదని మీ నాయకుడు పార్లమెంట్‌ మెట్లకు సాష్టాంగనమస్కారాలు వగైరా పెడతాడు, నువ్వేంది స్వామీ, కర్రలు తీసుకుని వీధుల్లో పడతావ్ అని అడగాల్నా వద్దా! ఈ డ్యూయల్‌ రోల్‌ రహస్యమేంటో చెప్పమని డిమాండ్‌ చేయాలా వద్దా! ఏదో ఒకటి చెప్పండి, అట్లాగే ఖాయం చేసుకుందారి అనాల్నా వద్దా1 ఏ రోటి కాడ ఆ పాట అంటే ఎలాగబ్బా వీళ్లతో వేగడం. జ్ఞానానికి అవధి ఉంటుంది, అజ్ఞానానికి ఎక్కడా! అనుకుని ఊరుకోవడానికి లేదు. ఇది జ్ఞానాజ్ఞానాలకు సంబంధించిన విషయం కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదానికి సంబంధించిన విషయం.
ఇపుడు కాస్త పెద్దమనిషి తరహాలో గంభీరంగా మాట్లాడుకుందాం. వీళ్ల గొడవేంటసలు. అహా, ఏంటసలు అని! అసలైతే వీళ్లతో మనం మాట్లాడలేం. వాదించలేం. మాట్లాడకూడదు, వాదించకూడదు. వాదిస్తే ఏమవుద్దో నీషే చెప్పాడు కదా! కానీ కొందరు చాలా పెద్దమనిషి తరహాగా తర్కపు ముసుగేసుకుని గొంతును బేస్‌ వాయిస్‌లోకి మార్చి ఆ రూట్లో ముందుకు వస్తుంటారు. స్వాములోర్లలో మాత్రం అందరూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారే ఉంటారా. అక్కడక్కడా కాస్త లాజికల్‌గా కనిపించాలని ప్రయత్నించువారు ఉంటారు. చర్చించకపోతే వీళ్లసలు ఊర్కోరు. వీళ్లేమంటారు?
images
ఈ దేశంలో హిందువులు అందరికీ చులకనైపోయారు. ఎవరుపడితే వారు నాలుగు రాళ్లు విసిరేయడమే అంటారు. అదే ఇస్లాంను అనగలరా, క్రైస్తవాన్ని అనగలరా! అమీర్‌ ఖాన్‌ అనే ముస్లిం కాబట్టి ఇలా చేశాడు అంటారు. ఈ చివరి ప్రశ్న జోలికి మనం పోకనక్కర్లేదు. అది దేడ్‌ దిమాక్‌ కంటే ఒక దిమాక్‌ తక్కువైన మాట. ఆనంద్‌ పట్వర్థన్‌ ఏ మతంలో పుట్టారని ఆయన సినిమాలను డాక్యుమెంటరీలు ఆంక్షల నడుమ నలిగిపోతున్నాయి. సంజయ్‌ కాక్‌ ఏ మతంలో పుట్టాడు? దీపా మెహతా ఏ మతంలో పుట్టింది? ఇక ఇతరత్రా విషయాల్లోకి వెళ్దాం. అదే అమీర్‌ ఖాన్‌ మసీదు లోకి మద్యం బాటిళ్లతో వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ముగ్గురు భార్యల మొగుడైన ముస్లిం వ్యక్తికి కోపం తెప్పిస్తాడు. అదే అమీర్‌ ఖాన్‌ ఇస్లామిస్ట్‌ టెర్రరిస్టుల దాడికి చలించిపోతాడు. చనిపోయిన తన మిత్రుడి చెప్పు మోసుకుని తిరుగుతాడు. అసలు ఇంత బాలెన్సింగ్‌ యాక్ట్‌ అనవసరం. ఇందులో కొన్ని అంశాల్లో ప్రత్యేకించి ముగ్గురుభార్యల సెటైర్‌లో స్టీరియోటైప్‌ వ్యవహారం ఉంది. హిరానీ ప్రమాదకరమైన పర్వతాల మధ్యలో తాడుమీద నడిచే మాదిరి విన్యాసం చేశాడు. అయినా ఈ గుంపులకు ఆనలేదు.
ఇపుడు హిందూ దేవతలే హిందూ బాబాలే దొరికారా అనే ప్రశ్న దగ్గరకు వద్దాం. ఇది హిందూ మెజారిటీ దేశం. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషైనా ఏ మతంలో ఉన్న దురాచారాల గురించి ఫోకస్‌ చేయాలి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లి ఇస్లాంను ఇట్లా చిత్రించగలరా అనేవారు ఈ దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారా అనేదానికి సమాధానం చెప్పాలి. ఎదుటోడు కన్ను పొడుచుకున్నాడు కాబట్టి మనం కూడా పొడుచుకోవాలి అనడం   తప్ప ఇందులో ఏమైనా ఉందా! అట్లాంటి స్థాయికి తీసికెడితేనే కానీ వీళ్లు పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించడానికి అవకాశం దొరకదు. అదీ అసలు విషయం.
ఏ దేశంలో నైనా పురోగామిగా ఆలోచించే శక్తులుంటాయి. ఏదో ఒక స్థాయిలో అక్కడి ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. క్రైస్తవ ఆధిపత్యంలోని దేశమైనా ఇస్లాం ఆధిపత్యంలోని దేశమైనా అన్ని దేశాల్లోనూ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. మనం చూడదల్చుకోకపోతే వేరే విషయం. బాబాల అవతారమెత్తి ఒక్కొక్కడు ఎన్ని రకాల నీచాలకు మోసాలకు పాల్పడుతున్నారో తెలిసి కూడా మా హిందూ బాబాలను అలా అంటావా అంటున్నారంటే వీరికి కనీసం తమ మతాన్ని సంస్కరించుకోవాలనే కోరిక కూడా లేదని అర్థమవుతోంది.
అక్కడక్కడా కొన్ని మౌలిక అంశాలు లేవనెత్తినప్పటికీ మొత్తంగా చూసినపుడు వివేకానంద స్కూల్‌కు దగ్గరగా ఉండే సంస్కరణ వాద వ్వవహారం ఈ సినిమా. తిరుగుబాటు వ్యవహారం కానేకాదు. చివర్లో బాబాతో చర్చ సందర్భంగా దైవాన్ని ప్రశంసించి అది సాంత్వనకు అవసరం అని చెప్పి భక్తులను సంతృప్తి పరిచే పని కూడా చేశాడు హీరానీ. కానీ మెయిన్‌స్ర్టీమ్‌ సినిమాలో ఆ మాత్రం ప్రయత్నం చేయడం, అది ఎక్కువమందికి చేరే విధంగా చేయడం రాజూ హీరానీ సాధించిన విజయం. అభినందించాల్సిన విషయం.
    -జి ఎస్‌ రామ్మోహన్‌
(2014, డిసెంబర్‌ 31న సారంగలో వచ్చిన వ్యాసం)

No comments:

Post a Comment