Thursday 14 April 2016

అర్చకుల ఆందోళన…ఏ ధైర్యంతో?!


samvedana logo copy(1)



అర్చకుల్లో కొందరు పేదలున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నదేవాలయాల్లో, శివాలయాల్లో. నిజమే. అయితే దానికి పరిష్కారమేంటి?అర్చక సంఘాలు, ట్రెజరీనుంచి జీతాలివ్వాలా? ఇవాళ వారికి వస్తున్న జీతాలు కానీ జీతాలు ఇస్తున్న పద్ధతి కానీ సక్రమంగా లేవని వాదిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే నెలనెలా ట్రెజరీ నుంచి మెరుగైన జీతాలిచ్చే ఏర్పాటు కావాలని కోరుతున్నారు.
సమాజానికి అవసరమైన ఉత్తత్తిలో పాలు పంచుకుంటున్న రైతులు, చేనేత కార్మికులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉత్పత్తి చేస్తున్నవారే మాకు ట్రెజరీ నుంచి జీతాలివ్వాలని ఇంతవరకూ కోరలేదు. ఏం ఉత్పత్తి చేస్తున్నారని పూజారులకు జీతాలివ్వాలి? గ్రామీణ సమాజపు అవశేషాలైన కమ్మరి, కుమ్మరి వంటి అనేక కులవృత్తులవాళ్లు ఆ సంకెళ్లనుంచి బయటపడి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. కూడు బెట్టని వృత్తిని పట్టుకుని వేలాడలేదు. సంఖ్య ఎక్కువవడం వల్ల కులవృత్తులకు సంబంధించి చేనేతలోనే ఎక్కువ సంక్షోభం కనిపిస్తుంది. వారెవరూ తమకు ట్రెజరీ బెంచ్‌నుంచి జీతాలిస్తే బాగుండుననుకోలేదు. డిమాండూ చేయలేదు.
ఆలయాల ఆదాయం నుంచి ప్రస్తుతం వేతనాలుగా అందరికీ సర్దుతున్నారు. అది పూజారులకు గౌరవమైన స్థాయిలో అందడం లేదు. అది నిజమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు కావాలనడం న్యాయమైన డిమాండ్‌ అవుతుందా! సమాజానికి అవసరమైన ఉత్పత్తి చేసేవాళ్లు, శ్రమజీవులు ఎన్నడూ ట్రెజరీ జీతాలు అడగలేదు. పూజార్లు ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఈ ధైర్యం ఇంకా మన మెదళ్లలో పాతుకుపోయిన కుల గౌరవాల నుంచి వస్తున్నది. ఆ డిమాండ్‌ విచిత్రమైనదిగా కనిపించకపోవడంలో మనలో పాతుకుపోయిన బానిస లక్షణం దాగుంది. మనిషిని ఆచరణనుంచి కాకుండా పుట్టిన కులం నుంచి కుటుంబం నుంచి చూసే ధోరణి బానిస ధోరణి.
మన కళ్ల ముందే రైతులు, చేనేత కార్మికులు ఉసురు తీసుకుంటూ ఉండగానే ఎలాంటి ఉత్పత్తి చేయని కులవృత్తి వాళ్లు వీధినపడి మాకు జీతాలేవీ అంటే ఆ రైతులకు, చేనేత కార్మికుల్లో కూడా చాలామందికి పాపం అయ్యవార్లు కూడా రోడ్డుమీదకొచ్చారు అనిపిస్తుంది. ఈ పాపం అనిపించడంలో ఆర్థిక స్థితి, పేదరికం మాత్రమే పనిచేస్తే ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. సాటి పేదవారి పట్ల ఎవరు కన్సర్న్‌ చూపించినా మంచిదే.
కానీ ఇక్కడ కులం పనిచేస్తుంది. అంతటివాళ్లు కూడా, అందర్నీ ఆశీర్వదించాల్సిన వారు కూడా వీధిన పడ్డారే అని మనలో తెలీని సానుభూతిని కలిగిస్తుంది. తలపై పెట్టాల్సిన చేయి మన చేయి కంటే కింద ఉంటే మనకే ఇబ్బంది అనిపిస్తుంది. అసుర చక్రవర్తి కాబట్టి బలి “ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రిందగుట-మీదై నాకరంబు మేల్గాదె…” అని భక్తి పూర్వకంగానైనా అనగలిగాడు. కానీ ఏదో ఒక కులంలో పుట్టి ఆ భావాలను ఏదో రూపంలో మోస్తున్న సామాన్యులు భూసురుల చేయి కిందయితే తట్టుకోలేరు. పేదపూజార్లకు దానమిచ్చి భోజనం పెట్టి పాదాభివందనం చేసే సంస్కృతి ఇంకా ఉంది.
ఏ పేదకైనా అటువంటి ట్రీట్మెంట్‌ ఇవ్వగలిగితే వారి దొడ్డమనసుకు నమోవాక్కములు చెప్పవచ్చును. అలా ఉండదు. ఇక్కడ కనిపించే గౌరవం వెనుక ఉన్నది కులం. పేదరికం కాదు. శ్రమ అంతకన్నా కాదు. అలాగే ఉపాధి కూలీ కన్నా తక్కువ వేతనం లభిస్తుంది అని అదేదో తక్కువ పని అన్నట్టు అర్చక సంఘాల మద్దతుదారులు రాస్తున్నారు. ఉపాధి కూలీ సమాజానికి అవసరమైన పని. పౌరోహిత్యం కన్నా తక్కువేమీ కాదు. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన ధార్మిక ఉత్పత్తిగా చూడాలి అని రైటిస్ట్‌ మేధావులు అనొచ్చు. అది భౌతిక వాస్తవాకతకు లొంగదు కానీ వాదనకోసం తీసుకుందాం. అపుడేం చేయాలి?

ప్రస్తుతం ఆధ్యాత్మికత, అర్చకత్వం అలౌకిక కోటాలో ఉన్నాయి. వాటిని లౌకిక పరిధిలోకి తేవాలి. మెరుగైన ప్రభుత్వ వేతనాలు కావాలంటే కుల ప్రాతిపదికను పక్కనబెట్టి ఆ పనిని ప్రజాస్వామిక ప్రక్రియలోకి తేవాలి. వైదికులకే పరిమితం చేయకుండా దానికేవో పరీక్షలు పెట్టి అర్హతలు నిర్ణయించాలి. అన్ని కులాల వారూ, మతాల వారూ ఆ పనిని చేపట్టగలిగే విధంగా మార్పులు చేయాలి. రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ట్రెజరీ జీతాలు కోరుతున్న వారు దీనికి సిద్ధమైతే చర్చించొచ్చు.
”అర్చకుడు వైదిక విభాగానికి చెందినవాడు. ఈవో పరిపాలనా విభాగానికి చెందినవాడు కానీ పూజల గురించి ఏమీ తెలియని ఈవో అర్చకుడికి బాస్‌. దేవుడినే నమ్మని, దైవభక్తిలేని, కొండొకచో ఇతర మతాలకు చెందిన వారూ అధికారుల పేరుతో ఆలయాల్లో ప్రవేశిస్తున్నారు” అని ఈసడింపుగా రాస్తున్నారు. అందులో ఉన్న ధ్వని ఏమిటి? ఏమి చెప్పదల్చుకున్నారు?
25KMPSRHI-W005__HY_2524109f
ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని అర్హతలు, పరీక్షలు, ఇంటర్యూలు అనే పద్ధతేదో ఉంటుంది. మనకిష్టమున్నా లేకున్నా అది ప్రజాస్వామికమైన ప్రక్రియ. ఎన్ని లోపాలు, అవకతవకలున్నా ఆ పద్ధతినైతే తప్పు పట్టలేము కదా! ఆ ఉద్యోగాలు కూడా బ్రాహ్మణులకే కట్టబెట్టండి అని అడగదల్చుకున్నారా! బ్రాహ్మడిపైన ఇంకొకరు బాస్‌ ఏంటి అది అనూచానపు సహజన్యాయానికి విరుద్ధం అని చెప్పదల్చుకున్నారా! అది నేరుగానే అడగొచ్చు. ఇతర కులాలను మతాలను విశ్వాసాలను పరోక్షరీతిలో కించపర్చనక్కర్లేదు. పూజార్లను చూసి ఆలయంలో వారు చేసే అలంకరణ చూసి ఆలయానికి వస్తారు కానీ అధికారులను చూసి వస్తారా అని రాస్తున్నారు, చెపుతున్నారు. దేవుడి మీద భక్తితో వస్తారేమో అనుకుంటున్నారు చాలామంది. ఇదన్నమాట అసలు విషయం! ఇక్కడా అలంకరణే ప్రధానమన్నమాట!
”కెసిఆర్‌ పరమ భక్తుడు. బ్రాహ్మణ పక్షపాతిగా కనిపిస్తారు. …అయినా అర్చకులు మాత్రం బ్రాహ్మణులు బజారును పడవలసి వస్తున్నది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని చెవివొగ్గి వింటే రాజాధిరాజా..రాజమార్తాండా..ధర్మం నాలుగు వర్ణాలా సాగే మీ పాలనలోనూ బ్రాహ్మణులకు ఇబ్బంది కలగడమేమిటయ్యా అని వినిపిస్తుంది. వీరికి రాజుపై ఉన్న నమ్మకం సరైనదే. కెసిఆర్‌ వ్యవహార శైలి రాజుకంటే తక్కువేమీ కాదు. ఆయన రాజులకు రాజు. నవాబులకు నవాబు. మంచీ చెడూ గురించిన చర్చ కాదు. పాలకుడి పద్దతి గురించి. అది ప్రజాస్వామికమైన పద్ధతి అని ఎక్కడా అనిపించదు. చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన తెలివైన వాడు, చదువుకున్నవాడు కావచ్చేమో కానీ పాలన అనేది రాజకీయ నాయకుడి తెలివితేటలకు సంబంధించిన విషయం కాదు.
ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్య స్వభావానికి సంబంధించిన విషయం. ఇతరులకు భయం కల్పించినా, అభయమిచ్చినా, చేతికి ఎముక లేనట్టు వరాలు ప్రకటించినా అన్నీ పాలకుడి వైయక్తిక ఆసక్తులకే ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తున్నది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం అనిపించవు. వైష్ణవ సంప్రదాయంలో మావోయిజాన్ని ఎజెండాగా ప్రకటించుకున్న పాలకుడాయె! ఉద్యమ సందర్భంగా ఎంచుకున్న పద్దతుల వల్ల ఆ గందరగోళం నుంచి బయటపడలేకపోవడం వల్ల తెలంగాణ సమాజంలో పురోగామి సమాజపు వెన్నెముక కూసింత వంగిపోయి ఉన్నది. తమకు నేరుగా చురుకు తగిలితే తప్ప ఇతరత్రా స్పందించే లక్షణం తక్కువ కనిపిస్తున్నది. అది రాజరికపు వాసన ఎదురులేని రీతిలో బలపడడానికి తావిస్తున్నది. రాజును ప్రసన్నం చేసుకుంటే చాలు అనే భావన అన్ని శిబిరాల్లో నెలకొంది.
అందువల్లే బ్రాహ్మణ పక్షపాతి అయిన రాజు పాలనలో ఈ తిప్పలేల అనే వాదన తెరపైకి తేగలగుతున్నారు. ఆ వాదనను పెద్ద స్థాయిలో చేస్తున్నారు. అర్చకులైనా మరెవరైనా నిజంగా బతుకు పోరాటమే చేస్తుంటే శ్రమను గౌరవించే వారెవరైనా వారివైపు నిలవాల్సిందే. అయితే వారు చేస్తున్న శ్రమ, దాని స్వభావం కచ్చితంగా చర్చకు వస్తుంది. బతుకుపోరాటానికి అవసరమైన భాష శ్రమ భాష. మేమీ శ్రమ చేస్తున్నాం, మాకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు అన్నది సరైన భాష అవుతుంది. మేము ఫలానా వాళ్లం కాబట్టి మాకు సరైన ప్రతిఫలం దక్కాలంటే సరైన భాష అవదు. కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మేం వైదికులం కాబట్టి మాకు మెరుగైన జీతాలివ్వాలి అంటే ప్రజాస్వామికం అనిపించుకోదు.
జి ఎస్‌ రామ్మోహన్‌
(సెప్టెంబర్‌ 3, 2015న సారంగలో ప్రచురితం)

No comments:

Post a Comment