తెలుగు
నేల మీద దాదాపు మూడు వేలమంది వడదెబ్బకు చనిపోయినట్టు వార్తలు చూస్తున్నాం.
ఇవన్నీ పదిరోజుల వ్యవధిలో జరిగినవే. పదిరోజుల్లో మూడువేల మంది మరణించడం ఏ
విధంగా చూసినా మానవీయ సంక్షోభమే. పదిరోజుల్లో వేలమంది చనిపోతే ఏ నాగరిక
ప్రపంచమైనా ఇంత నిర్లిప్తంగా ఉంటుందా!
అయితే
ప్రభుత్వాలు ఏం చేయాలి? వాళ్లకు గొడుగు పట్టాలా? అని ప్రశ్నించే మేధావులు
ఉంటారని తెలుసు. మనకంటే వాతావరణ సంక్షోభాలు ఏర్పడే దేశాలు చాలానే ఉన్నాయి.
శీతల దేశాల్లో ఇంత కంటే అననుకూల పరిస్థితులు ఉంటాయి. మరి అక్కడ జనం ఎం దుకు
మనలాగా రాలిపోవడంలేదు. జనం పిట్టల్లా రాలుతుంటే దీనికి పరిష్కారం
కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉండదా! ఒక గుండెనో కిడ్నీనో మార్పిడి
చేస్తున్నారంటూ ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో తరలించి నగరాల్లో
ట్రాఫిక్లు ఆపి దాన్ని గొప్ప మాన వీయమైన పనిగా మీడియాలో అదే పనిగా
చాటుకునే సమాజం వేలమంది రాలిపోతున్నా నిర్లిప్తంగా ఉండిపోవడంలో పని
చేస్తున్న అంశమేమిటి? ఒక్క ప్రాణం కాపాడడం కోసం చూపించే ఈ తపన దానికి
సమాజంలో కనిపిస్తున్న స్పందన వేయిమంది చనిపోయిన పుడు ఎందుకు కనిపించడం
లేదు. దానికి దీనికి నేరుగా సంబంధం లేకపోవచ్చు. అవయవమార్పిడికి పాజిటివ్
సింబాలిజం అవసరమే. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కానీ అదే
సెన్సిబిలిటీలో వందో భాగమైనా ఎందుకు ఇక్కడ కనిపించడం లేదన్నదే ప్రశ్న.
హుద్ హుద్ తుపాను ఆంధ్రప్రదేశ్ను అతలా కుతలం చేసిందని రాష్ట్రం నడుము
విరిగిందని చాలా చాలా బాధపడ్డాం. విశాఖను చూసి అయ్యో అననివారు లేరు. విశాఖ,
ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రాణ నష్టం తక్కువ. ఆస్తి నష్టం ఎక్కువ. అయినా
సరే, దానిపై చూపిన కన్సర్న్లో వందో భాగం కూడా వడదెబ్బ మరణాలపై ఎందుకు
చూపించలేకపోతున్నాం. ఆస్తి నష్టానికి చూపించిన స్పందన ప్రాణ నష్టంపై
కనిపించకపోతే ఆ సమాజపు ఆలోచన సవ్యంగా ఉన్నట్టు భావించాలా! తుపానులను
ఉత్పాతాలుగా చూసినట్టుగా వడదెబ్బను చూసే దృక్పథం మనకు లేదు. ఎండలు అలవాటైన
దేశం కాబట్టి అది చండ ప్రచండమై వేలమందిని బలితీసుకుంటున్నా మామూలే అన్నట్టు
చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యం అనే విషయంలో మన దృక్పథంలోనే మార్పు
రావాల్సిన అవసరం ఉంది.
నిపోతున్న వారిలో అత్యధికులు
పేదలు. చచ్చినట్టు ఎండన బడక తప్పనిసరిస్థితిని ఎదుర్కొంటున్నవారు. గ్రామీణ
ఉపాధి హామీ కూలీలు, చిన్నచిన్న పనులు చేసి పొట్ట పోషించుకునేవారు. పనిలోనో
ప్రయాణంలోనో కనీస నీటివసతి కరువై ప్రాణాలొదిలిన వారు. తుపాన్ల సమయంలో
పల్లపు ప్రాంతాల్లోని జనాన్ని బలవంతంగా నైనా తరలించి జాగ్రత్తలు
తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకోలేం? కనీస జాగ్రత్తలు తీసుకుంటే
నివారించవచ్చును. ఎండా కాలం అడవుల్లో జంతువులకు సైతం తొట్టెలు తవ్వి నీటిని
నింపే ప్రభుత్వాలు మన మధ్యలో మనుషులు ఇంత సంఖ్యలో రాలి పోతుంటే కనీస
జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? పోనీ, ఇది తెలీకుండా హఠాత్తుగా
విరుచుకుపడిన ఉత్పాతం కూడా కాదు. రెండేళ్ల క్రితం కూడా పెద్దసంఖ్యలో
మనుషులు మరణించారు.
ప్రభుత్వాల
ఆలోచనల్లోనే కాదు, సివిల్ సొసైటీ ఆలోచనల్లో కూడా ఆ పరిమితి ఉంది. మనం
ఆర్థికంగా, సాంఘికంగా ఏ సమూహంలో ఉన్నామో ఆ సమూహపు ప్రయోజనాలే తమ
ప్రయోజనాలుగానూ ఆ సమూహపు కష్టాలే తమ కష్టాలుగానూ భావించే ఆలోచన ప్రబలంగా
ఉంటుంది. 90ల తర్వాత మారిన పరిస్థితులు తాము చేరాలని ఆశించే సమూహపు
ప్రయోజనాలతో కింది మనుషులు కూడా లంకె వేసుకునే విధంగా మార్చేశాయి. దీంతో
ఆలోచనా పద్ధతిలో చాలా తేడా కనిపిస్తున్నది. ఎండకు వానకు మనమెందుకు చస్తాం.
వాళ్లెవరో చస్తారు కానీ అనే భ్రమ ఒకటి ఉంటుంది. పెళ్లికి హాజరు కావడానికి
టూవీలర్ మీద దూర ప్రయాణానికి బయలుదేరిన టీచర్, లాయర్ కూడా మృతుల్లో ఉం
డొచ్చు. అయినా ఎక్కువలో ఎక్కువ పేదలుంటారు కాబట్టి ఏ సమూహమూ తనవారిగా
తీసుకోదు. దీనికి తోడు ఎన్నికల్లో ప్రెషర్ గ్రూప్గా పనిచేయగలిగిన సమూహ
లక్షణం లేదు. ప్రభుత్వాలు అందుకే ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయా
అనిపిస్తుంది.
-జి.ఎస్. రామ్మోహన్
(జూన్11, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)
(జూన్11, 2015న ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)
No comments:
Post a Comment