Saturday, 11 October 2014

మార్క్కూజ్‌ స్మృతిలో..!


ఆ తర్వాతెప్పుడో హండ్రెడ్‌ ఇయర్స్ ఆఫ్‌ సాలిట్యూడ్‌ హైదరాబాద్‌ ఫుట్‌పాత్‌ మీద కొనుక్కొని చదివి భయపడిపోయా, ఆశ్యర్యపడిపోయా,.ఆనందపడిపోయా. అచ్చు ఆయన పాత్రలు తొలిసారి ఐస్‌ ముక్కలు చేతుల్తో ముట్టుకున్నట్టుగానే. అంతకుముందెప్పుడో మద్రాస్‌ ఆనంద్‌(నవయాన్‌ ఆనంద్‌) లవ్‌ ఇన్‌ద టైమ్స్ ఆఫ్‌ కలరా ఇచ్చి మార్క్కూజ్‌ అనే మనిషిని నా నెత్తిన పాతేశాడు. ఆ మార్కూజ్‌ ఇక లేరు. ఇపుడే ఫేస్‌బుక్‌లోకి అడుగుపెడితే మద్రాస్‌ మోహన్‌ పోస్టులో ఆయన కొటేషన్‌ కనిపించింది. ఎందుకో అనుమానం వచ్చి పోస్టుల్లోకి వెడితే వేణుగారు, వనజ పోస్టుల్లో ఆయన లేరన్న విషయం తెలిసింది. నిరంతరం వార్తల మధ్య బతుకుతూ కూడా ఈ వార్త ఫేస్‌బుక్‌లోకి వెడితే తప్ప తెలీని స్థితి ఉండడం..హౌ అబ్సర్డ్‌. ఎందుకో తెలీదు. ఎక్కడో కలుక్కుమన్న ఫీలింగ్. మనసంతా ఆయన పాత్రలే. ఏం సబంధం ఆయనతో! చూడనైనా చూడలేదు. మహా అయితే రెండు మూడు పుస్తకాలు చదివి ఉంటాను. మహా అయితే రచయితంటే వీడురా బుజ్జీ అనుకుని ఉంటాను. ఇతన్ని రైటర్‌ అని మనల్ని రైటర్‌ అని ఒకే పేరుతో పిలిస్తే ఏం బాగుంటుంది. మనం ఏమీ రాయకపోతేనే మేలు అని ఆనందవైరాగ్యం కూడా పొంది ఉంటాను . అయితే మాత్రం ఇంతగా ఎందుకు వెంటాడుతున్నాడతను. అతనికి మనకు ఏమిటి సంబంధం!

If I knew that today would be the last time I’d see you, I would hug you tight and pray the Lord be the keeper of your soul. If I knew that this would be the last time you pass through this door, I’d embrace you, kiss you, and call you back for one more. If I knew that this would be the last time I would hear your voice, I’d take hold of each word to be able to hear it over and over again. If I knew this is the last time I see you, I’d tell you I love you, and would not just assume foolishly you know it already."
(మార్కూజ్‌ మరణ వార్త విని ఏప్రిల్‌ 18, 2014న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌)

పల్లె బతుకుపై అక్షర చిత్రం

నేడే చదవండి.పల్లె బతుకు లోతుల్ని తవ్వి తీసిన విద్యాసాగర్ అపురూపమైన అక్షర చిత్రం పల్లెను మింగిన పెట్టుబడి. మాయా లేదు, మర్మం లేదు. గాలిమేడలు కట్టడం అసలే లేదు.నిద్రలో ఉన్నవారిని, నిద్రనటించేవారిని మేల్కొలిపే రాత యిది. ఈ నేల గురించి ఈ నేలను నమ్ముకున్న మనుషుల గురించి  ప్రేమ ఉన్న వారు, వారికోసం ఏమైనాచేయాలనుకునే వారు తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మా రోజుల్లో అనే తలపోతల నుంచి, పల్లెలు కూడా చెడిపోతున్నాయి అనే వలపోతల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపకరించే సాధనం ఈ పుస్తకం. పట్నవాసపు సౌఖ్యాలను అందుకుంటూ పల్లెగురించి తెలిసీ తెలీని రాతలు రాసే రచయితల వల్ల వ్యాపించిన రోమాంటిసిజమ్ అనే వ్యాధిని నయం చేసే కషాయం ఈ పుస్తకం. గ్రామీణ సమాజం,వ్యవసాయం,వృత్తులు,వలస, పెట్టుబడి, వాటి అంతస్సంబంధాల గురించి అధ్యయనం చేయాలనుకునే వారు అవశ్యం పఠించాల్సిన గ్రంధం. తిరోగామి వాదాన్ని పురోగామివాదంగా విప్లవకరంగా ప్రచారం చేస్తూ చరిత్రను, సామాజిక చలనాల్ని తలకిందులుగా చూపిస్తున్న మేధావులను సరిచేసి నిటారుగా నిలబెట్టే శక్తి కలిగిన అక్షరాయుధం. వామపక్ష రాజకీయాల్లో ఇటీవల తీవ్రస్థాయిలో సాగుతున్న  మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ డిబేట్‌ని ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న పుస్తకం. సాధారణ కార్యకర్తలకు సైతం సులభంగా ఆ అంశాలను వివరించగలిగిన పుస్తకం. ఆ రకంగా  సామాజిక రాజకీయ రంగాలకు విద్యాసాగర్‌ చేర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు.

విద్యాసాగర్‌ ఏం చెప్పారు? గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌ అనే పరమ చెత్తను మోసుకు తిరుగుతున్న వారి బండారాన్ని బయటపెట్టారు. గ్రామీణ సమాజంలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని అది కొందరి స్వకపోల కల్పితమని ఆధారాలతో సహా చూపించారు.శ్రీకాకుళం జిల్లాను నమూనాగా తీసుకుని ఊరూరూ తిరిగి గొడ్డుచాకిరీ చేసి మరీ నిరూపించారు. గతంలో సుందరయ్య లాంటి వారు చేసిన సర్వేల కంటే విసృతమైనది ఇది. ఉత్పత్తి, రవాణా మెరుగుపడని సమాజాల్లో జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో నివేదికల సాక్ష్యంగా చూపించారు విద్యాసాగర్‌. గతం స్వర్ణయుగం కాదని తెలిసిన వారికి కూడా ఒళ్లు జలదరించే నివేదికలవి. బిడ్డలను 6 నుంచి 12 దినార్‌లకు అమ్మివేయడం దగ్గర్నుంచి బిడ్డల్నే చంపి తినేదాకా చరిత్ర పొడవునా దారుణమైన కరువులు. గుర్రాలు, ఏనుగుల మలంలో ధాన్యం కోసం వెతుక్కునే దగ్గర నుంచి కోటలోంచి ఒక గాడిద బయటకు వస్తే దానిమీద తోడేళ్ల మందవలెపడి కండరకండరాన్ని పీక్కుతినే ఉదంతాల దాకా ఎన్నో భరింప శక్యం కాని ఉదాహరణలిచ్చారు. ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండి కరువు కాటకాల సమయంలో బయటినుంచి ధాన్యం వచ్చే రవాణా ఏర్పాట్లు లేని రోజున ఈ సమాజం ఎలా ఉండిందో సామాజిక చలనాల గురించి తెలిసినవారు ఊహించగలిగిన విషయాలే. నిన్న కాక మొన్న బెంగాల్లో చూసిందే. చరిత్ర తెలుగు సినిమా కాదు. ఇది అర్థభూస్వామ్య అర్థ వలస సమాజమనే విశ్లేషణను పూర్వపక్షం చేశారు విద్యాసాగర్‌. పెట్టుబడి దానితో పాటే లాభాలపోటీ ఎట్లా విస్తరిస్తున్నాయో స్వేచ్చగా శ్రమను అమ్ముకునే అవకాశాలు ఎలా పెరిగాయో వివరించారు. రోలు, మిక్సీ పక్కపక్కనే ఉండే స్థితిని చూపించి పెట్టుబడి భూస్వామ్యంతో మిలాఖత్ అయ్యిందని గాలిపటాలెగరేయలేదు. దానికి భిన్నంగా ఆదిమ సమాజం నాటి కంక నుంచి ఇవాల్టి ట్రాక్టర్‌ దాకా అన్నీ ఉనికిలో ఉండి కూడా పెట్టుబడిదారీ సంబంధాలు సాధ్యమేనని ఉదాహరణలతో చాటారు.మతాన్ని కులాన్ని ముందుపెట్టి  పెట్టుబడి వాటితో సహజీవనం చేస్తున్నది కదా అని కూడా కొందరు అంటుంటారు. పెట్టుబడిదారీ సమాజంలో మతం- కులం ఉండవని ఎవరు చెప్పారో ఎందుకలాంటి అపోహ ఏర్పడిందో తెలీదు. మనలాంటి దేశాల్లో పెట్టుబడికి పురోగామి స్వభావం ఉండదని ఇంకొంతమంది మిత్రులు వాదిస్తూ ఉంటారు. ఇక్కడ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదీ రాలేదని అందువల్ల పెట్టుబడికి సానుకూల స్వభావమేదీ లేకుండా పోయిందని చెపుతూ ఉంటారు. రైలు అనే ఒక సాధారణ రవాణా సాధనం తెచ్చిన మార్పుల గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చక్రానికే అంత శక్తి ఉంటే శాటిలైట్‌కి ఎంత ఉండాలి!  పెట్టుబడికి ఒక స్వభావముంది. బూర్జువా ప్రజాతంత్ర విప్లవం షరతు ఏమీ కాదు. షరతుగా చెప్పడమంటే ఉత్పత్తి సంబంధాలకు మనిషి చైతన్యానికి మధ్య సంబంధాన్ని తిరస్కరించడం. పాత సంబంధాలను ధ్వంసం చేయకుండా పెట్టుబడి పురోగమించలేదని విద్యాసాగర్‌ తేల్చిచెప్పారు. పెట్టుబడి తనతో పాటు తీసుకువచ్చే సాంకేతికత  ఫ్యూడల్‌ సంబంధాలను నాశనం చేయడానికి ఎలా ఉపయోగ పడుతుందో చూపించారు. వాడిపడేసే ప్లాస్టిక్‌ గ్లాసులు రావడం రెండు గ్లాసుల విధానం పోవడానికి ఎలా దారితీసిందో చిన్న ఉదాహరణతో సంకేతాత్మకంగా చెప్పారు. ఇది చదువుతుంటే ఉత్తరాదిన నాగళ్లు పోయి ట్రాక్టర్లు రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కుల అణచివేతకు సంబంధించిన కొన్ని రూపాలు ఎలా అంతరించాయో చెప్పే అధ్యయనాలు గుర్తొచ్చాయి. గతంలో అనూరాధాగాంధీ లాంటివారు గ్రామీణ-కుల సంబంధాలను మార్చడంలో పెట్టుబడి పాత్ర గురించి ప్రస్తావించినా దాని ప్రాధాన్యాన్ని పట్టించుకోలేదు. వృత్తికార్మికులకు సంబంధించిన వివరణలో ట్రాప్డ్‌ అనే పదాన్ని ఉపయోగించినా దాన్ని చాలా పరిమితమైన అర్థంలో పాసింగ్‌గా వాడారు. విద్యాసాగర్‌ ఆ  ఖాళీని పూరించారు.
14844_front_cover
మెరుగైనా రవాణా సౌకర్యాలు ఏర్పడడం కూలీరేట్లు పెరగడానికి ఏ విధంగా దోహదం చేసిందో రచయిత వివరించారు. ”కులవృత్తుల విధ్వంసం అనేది పెట్టుబడి చొరబాటుకు మౌలిక అవసరం. గ్రామీణ ధనిక రైతాంగానికి అర్థబానిస రూపంలో దీర్ఘకాలం కట్టివేయబడిన ఈ కులవృత్తుల సమాజం స్వేచ్ఛగా శ్రమను అమ్ముకునే కూలీలుగా మారారు” అని తేల్చారు. వృత్తులు కొనసాగాలని కోరుకోవడమంటే మనుధర్మాన్ని కొనసాగించాలని కోరుకోవడమేనని, వామపక్ష మేధావులు కూడా అ పాట పాడడం అన్యాయమని చెప్పారు. ఎన్ని సాకులు చెప్పి ఏ రూపంలో వివరించినా అది తిరోగమనమేనని నిర్మొహమాటంగా చెప్పారు. భారత దేశంలో పురోగామివాదులు ప్రధానంగా మార్క్స్‌ అనుయాయులు. లేదంటే అంబేద్కర్‌ అనుయాయలు. ఇద్దరి లోంచి అవసరమైనవి తీసుకోవాలని భావించేవారు కూడా ఉండొచ్చు. ఆ ఇద్దరూ వృత్తులు ధ్వంసం కావాలనే కోరుకున్నారు. వృత్తులు కొనసాగాలని కోరుకున్నది గాంధీ. ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ప్రవచించిన విషయాలు ఆచరణ సాధ్యం కానివి. సమాజాన్ని వెనక్కు తీసికెళ్లేవి. కానీ విచిత్రంగా మార్క్సిస్టులని చెప్పుకునేవారు కూడా రకరకాల వాదనలతో వృత్తులను ఆరాధించడం  చూస్తూ ఉంటాం. సమాజాన్ని మార్చాలనే బాధ్యతను భుజాన  వేసుకున్న వారెవరైనా వ్యూహాలు-ఎత్తుగడలకు సంబంధించిన గాంధీ నాయకత్వ పటిమనుంచి స్ఫూర్తి పొందొచ్చు. ఆయన వాదంనుంచి కాదు.  వ్యక్తిగా ఆయన మహానాయకుడు. ఆయన జీవితం ప్రతి కార్యకర్త తప్పనిసరిగా చదివి తీరాల్సిన పాఠం. కానీ మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతోంది. వ్యక్తిగతంగా ఆయన్ను దూషించడం, భావజాలంలో ఆయనను అనుసరించడం వంటి విచిత్రాలు మనం చాలాకాలంగా చూస్తున్నాం. అందుకే ఈ రచయిత మీరెటువైపు, మనువు-గాంధీవైపా, మార్క్స్‌-అంబేద్కర్‌ వైపా అనేరీతిలో అడగాల్సిన ప్రశ్నే అడిగారు.
22vzgss03-book__23_1594038e
విద్యాసాగర్‌ ఇంకా ఏం చెప్పారు? వ్యవసాయ సంక్షోభం ఏటికేడు ఎందుకు తీవ్రమవుతున్నదో వివరించారు. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంక్షోభం పెరగడం వెనుక కారణాలను సరిగా పట్టుకున్నారు. ప్రధానంగా అది చెల్లింపుల సంక్షోభం అని తేల్చారు. వ్యవసాయం వ్యాపారంగా మారిపోయిందని విస్పష్టంగా వివరించారు. సేద్యంలోకి ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం దగ్గర్నుంచి రైతాంగం జీవనశైలి మార్పుల దాకా అనేకానేక అంశాలను చర్చించారు. పిల్లల చదువులకు ఎక్కువ ఖర్చుపెట్లాల్సిన స్థితితో పాటు బర్త్‌డే పార్టీల్లాంటివి పెరిగిపోవడం లిక్కర్‌ వాడుక పెరిగిపోవడం లాంటి అంశాలను మన ముందుంచారు. “తక్కువ ఖర్చుతో జీవితం గడిచినప్పటికీ అతితక్కువ ఆదాయం ఉండడంతో ఫ్యూడల్‌ సమాజం ఒకరకం సంక్షోభం సృష్టిస్తే పెరిగిన ఆదాయాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చులు పెంచి పెట్టుబడి మరో రకం సంక్షోభం సృష్టిస్తోంది” అని   ప్రకటించారు. వాస్తవానికి ఒకనాడు గ్రామీణ సమాజంలో ఖర్చు అంటే ప్రధానంగా తిండి ఖర్చే. ఇవాళ పట్టణాల మాదిరే ఇతర ఖర్చులు తిండి ఖర్చును మించిపోయాయి. ఈ మార్పు సమాజం ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్లిందనేదానికి సంకేతం. ఇవాళ గ్రామాలంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అవి పట్టణాల ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే అని చక్కని మాట చెప్పారు. ఇళ్లలో పాల చుక్కవాడకుండా అన్నీ పాలకేంద్రాలకే పోస్తున్న ధోరణి గురించి రచయిత ఒక చోట ప్రస్తావించారు. గ్రామాల్లో పెట్టుబడి తెచ్చిన విషాదం ఇక్కడుంది. ఒకనాడు ఎదురింటి రైతుకు కుడితి నీళ్లు పోస్తే పెరుగో మజ్జిగో పోసేవారు. కూలీపని నుంచి వస్తూ వస్తూ ఏదో ఒక పొలంలో పిడికెడు గోంగూర పెరక్కొచ్చుకుని ఏదో ఒక రొట్టె చేసుకుంటే పూటగడిచేది. ఒక వీధిలో చిక్కుడు పాదుకు కాయలు కాస్తే ఆ ఆవీధిలోని ఇళ్లన్నింటా ఆ రోజు చిక్కుడు గుభాలించేది. ఏదీ లేని నాడు ఊరికే పడిఉండే మునగచెట్లనుంచి నాలుగు ఆకులు దూసి ఉడికేసుకుంటే పూటగడిచేది. అమ్మడం-కొనడం జీవితాన్ని ముంచెత్తని  దశ కావడం వల్ల ఇరుగు పొరుగు సహకార జీవనం ఒకటి ఉండేది. ఒకే సాంఘిక హోదా కలిగిన కుటుంబాల మధ్య ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి ఆదాన ప్రదానాలుండేవి. అన్నీ సరుకులుగా మారి మార్కెట్‌కు వెళ్లడం వల్ల  ఇవాళ పల్లెల్లో కూడా ఈ రకమైన జీవనం కనిపించడం లేదు. గుంపు జీవనంలో ఉన్న అణచివేత తగ్గడం వంటి సానుకూల పరిణామాలతో పాటు అదే జీవనంలో కొంతవరకు అంతర్భాగంగా ఉండే  సహకార ధోరణి పోయి వ్యక్తి ఒంటరవుతున్న దృశ్యం కనిపిస్తోంది.
గ్రామీణ సమాజం సంవత్సరమంతా మట్టిగడ్డలను కౌగిలించుకుని, అర్థబానిస తరహా శ్రమను చేస్తూ పండించిన ఉత్పత్తిని మార్కెట్‌కు ‘విలువ తక్కువ’ ఉత్పత్తులుగా  ఎగుమతి చేస్తోంది. తిరిగిన తనకు అవసరం ఉన్నా లేకపోయినా ‘విలువ ఎక్కువైన’ పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిని మార్కెట్‌ కల్పించింది. ఈ చెల్లింపుల సంక్షోభమే నేటి రైతు సంక్షోభం” అని విద్యాసాగర్‌ వివరించారు.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడం గురించిన ప్రస్తావన ఒక చోట చేశారు. తాను కొనుగోలు చేసే వస్తువుల రూపంలో పన్నుభారం, వ్యవసాయంపై మదుపు భారం అనే  ” ఈ రెండు పర్వతాలను మోస్తున్న భారతీయ రైతాంగం ఆ భారాన్ని వదిలించుకోవడానికి పట్టణ శ్రామిక వర్గంగా మారుతోంది.” అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లోపించడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉత్ప్తత్తి ఇంకా ఎందుకు దారుణంగా ఉంటోంది? చైనాలో హెక్టార్‌కు ఆరు టన్నులకు మించి వరి పండిస్తూ ఉంటే మనం మూడు టన్నులు కూడా ఎందుకు చేరలేకపోతున్నాం అనేది ఆలోచించాలేమో! ఒక సీజన్‌లో కిలో యాభై రూపాయలు పలికే ఉల్లి, టమోటా, ఆలూ మరో సీజన్‌లో రోడ్డుమీద పారేయాల్సిన స్థితికి ఎలా వెడుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాలేమో!  వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి అతిగా మాట్లాడే ప్రభుత్వాలు ఆచరణలో దుర్మార్గమైన నిర్ల్యక్షం చూపడాన్ని కచ్చితంగా ప్రశ్చించాలి. కోళ్లకు దాణాగా ఉన్న మొక్కజొన్న శ్రీకాకుళం జిల్లాలో 8500 ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పెరగడాన్ని ప్రస్తావిస్తూ”మనుషులు తినే ఆహారం కోసం విదేశాలవైపుకు కోళ్ల ఆహారం కోసం దేశీయ పొలాలకు అనే వ్యూహం ఏ న్యాయసూత్రాల ప్రకారం సరైనదో ఆలోచించాలి” అన్నారు. ఇక్కడ రచయిత ఒక విషయం మర్చిపోయారు. కోళ్లు కూడా మనుషులు తినే ఆహారమే. ఈ దేశంలో ఎక్కువ జనాభా తినే ఆహారం. ఒకనాడు పండక్కో పబ్బానికో లేక ఇంటికి బంధువొచ్చినపుడో మాత్రమే తినగలిగే ఆహారం ఇవాళ బ్రాయిలర్‌ కోళ్ల వెల్లువ వల్ల తరచుగా తినే ఆహారంగా మారింది. ఇది సానుకూలంగా చూడాల్సిన పరిణామమే. రచయిత చెప్పిన అర్థంలో అయినా మనుషులు తినే ఆహార ఉత్పత్తిలో మనమేం వెనుకబడిలేం. ఏటా కోట్ల టన్నుల ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతోంది. ఆహారపంటల వైశాల్యం తగ్గిపోతోందని ఆందోళన పడాల్సిన అవసరమేమీ ఇవాళ లేదు. ఇలాంటి చిన్న చిన్న వివరాల విషయం పక్కనబెడితే మౌలిక మైన విషయాలన్నింటా రచయిత పూర్తిగా శాస్ర్తీయమైన దృక్పధాన్ని పాటించారు.
తెలుగు నేలమీద వలస వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతున్నది. బలవంతపు వలసలను వ్యతిరేకించవచ్చు. పేదరికాన్ని ఆసరా చేసుకుని భూములు తక్కువకు కొనుగోలు చేసే దోపిడీని వ్యతిరేకించవచ్చు. ”కుండా సట్టి మూటనుగట్టి ఉండా బిడ్డల చంకనబెట్టి మాసం మాసం గాసం కోసం దేశం దేశం తిరిగే పేదల” బతుకుల గురించి ఆందోళన తోనూ ఆర్తితోనూ చర్చించొచ్చు. కానీ మొత్తంగానే వలస అనేపదాన్ని బూతుపదంగా మార్చకూడదు. ఇక్కడ రచయిత సరైన వైఖరి తీసుకున్నారు. వలస  తెచ్చిన సానుకూల పరిణామాలను చూపారు. కూలీ రేట్లలో వేతనాల్లో వచ్చిన మార్పులను చూపారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో కూలీలు తమకిష్టమైన చోట శ్రమను అమ్ముకునే వెసులుబాటు కలిగిన తీరును చూపారు. తలదాచుకోవడానికి గ్రామం-శ్రమను అమ్ముకోవడానికి బస్తీ అనే పరిణామాన్ని పట్టుకున్నారు. మద్రాస్‌ పోయిన దళిత కూలీలు తమ గ్రామాల్లో రైతులకు డబ్బులు అప్పు ఇచ్చే స్థితికి చేరిన విధానాన్ని వివరించారు. “మనిషి తన వృత్తిని మార్చుకోగలగడమే అతని మనుగడకు పునాదిగా ఉందని గుర్తించాలి. అలా గుర్తించకపోతే మనిషి రాకాసి బల్లి అయ్యే ప్రమాదముంది” అని చక్కని మాట చెప్పారు. అప్పుల విధానంలో వచ్చిన మార్పుల గురించి చెపుతూ ఫాయిదాలు, ముందస్తు ధర ఖండన ,అప్పులిచ్చిన షావుకారికి పంటను అమ్మాలనే షరతులు రద్దయ్యాయి. ఆ స్థానంలో సరళమైన వడ్డీరేట్లతో అప్పులు దొరికే స్థితికి శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలు చేరుకున్నాయి” అని  మంచి మాట చెప్పారు. సరళమైన అప్పులైనా మన వ్యవసాయ రంగంలో ఉరిత్రాడే. కాదనలేం. కాకపోతే సామాజిక సంబంధాల పరంగా చూసినపుడు గ్రామీణ వడ్డీవ్యాపారికి ముందస్తు ధరకు పంట అమ్మడం లాంటి బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేది ముఖ్యమైన పరిణామం. ”ఏ దేశంలో అయినా ఫ్యూడల్‌ వ్యవస్థను ధ్వంసం చేసేది పెట్టుబడే. ఆ పని భారతదేశంలో దాదాపుగా పూర్తయ్యింది”. అని మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఈ సమాజం స్వరూపస్వభావాలేమిటో చెప్పకనే చెప్పారు. సామాజిక సంబంధాల విషయంలో నిశిత పరిశీలన వల్ల  వాస్తవాలను వాస్తవంగా చూపే వీలు కల్పించింది. ముఖ్యంగా రచయిత  శ్రామికుల- శ్రామిక కులాల దృక్కోణం నుంచి సమాజాన్ని పరిశీలించారు. సాధారణంగా గ్రామీణ సంబంధాల్లో మార్పులను పైనించి చూసేవారికి కోల్పోయిన దర్జా గుర్తొస్తుంది. కింది నుంచి చూసేవారికి వదిలించుకున్న బానిసత్వం గుర్తొస్తుంది.  పాలేర్ల వ్యవస్థ పోవడంతో పశుసంపద అంతరిస్తున్న వైనాన్ని సాగర్‌ బాగా చెప్పారు. రైతుకు-పశుసంపదకు తల్లీ బిడ్డ సంబంధమని అదనీ ఇదనీ మనదగ్గర పురోగామివాదులనుకునే వారు సైతం బోలెడు సెంటిమెంట్లు గుమ్మరిస్తుంటారు. అనుబంధం ఉండే మాట వాస్తవమేగాని అది తన జీవికను మించి కాదు. పశుమాంసం ఎగుమతిలో మన దేశం ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్న విషయం గుర్తు చేసుకుంటే మన పశువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు వాటిని తరలిస్తున్నారో అర్థం అవుతుంది. గతంలో దళితులు నికర ఉద్యోగంగా లభించే పాలేరు వృత్తి దొరకడమే అదృష్టంగా భావించేవారని ఆ స్థితి ఇవాళ పోయి కాస్త మెరుగైన ఉపాధి దొరుకుతున్నదని సానుకూల పరిణామాన్ని రచయిత వివరించారు. ”గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు వృత్తిని ఉపాధిని కల్పించిన అర్థబానిస వ్యవస్థ అయిన పాలేరు వృత్తి నుంచే కాక, అర్థాకలితో మాడ్చి చంపిన వ్యవసాయ కూలీ రంగం నుంచి కూడా దళితులు నిష్ర్కమిస్తున్నారు” అని గతాన్ని వర్తమానాన్ని కలిపి వివరించారు. “స్వతంత్ర జీవనం సాగించడానికి పట్టణాల్లో ఉపాధి దొరకడం, సాంఘిక గౌరవం లభించడం” అనేవి పాలేరు వ్యవస్థ పోవడానికి కారణాలుగా దళితుల మాటల్లోనే చూపారు. సాంఘిక గౌరవమనగానే పట్నాల్లో కులం లేదా అని దీర్ఘాలు తీయనక్కర్లేదు. పల్లెల్లో కులానికి పట్నాల్లో కులానికి తేడా ఉంటుంది. ఈ మార్పు కేవలం పరిమాణాత్మకంగా మాత్రమే కొందరికి కనిపించొచ్చు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అది గుణాత్మకమార్పుగా మారుతున్నదని అర్థమవుతుంది. యాంత్రీకరణ జరిగితే ఉపాధి పోతుందని ‘సర్‌ప్లస్‌ పీపుల్‌’ పెరుగుతారని గాంధీలాగే చాలామంది ఇప్పటికి కూడా భావిస్తుంటారు. ట్రాక్టర్లు వచ్చాక కూలీలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణబాట పట్టారని దీనితో కూలీల కొరత తీవ్రమై కూలీరేట్లు పెరిగాయని వాస్తవ స్థితిని రచయిత వర్ణించారు.
అయితే ఏమిటి? ఇంతకుముందున్నది నరకమూ, ఇప్పటిది స్వర్గమూనా అనొచ్చు. కానే కాదు. రచయితకు స్పష్టత ఉంది. విద్యాసాగర్‌ కమ్యూనిస్టు. ఎంత కమ్యూనిస్టు అంటే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి రాయాల్సి వచ్చినపుడు మహాత్మాగాంధీకి కోట్స్‌ పెట్టే అంత కమ్యూనిస్టు. కాట్‌స్కీని ఎక్కువగా కోట్‌ చేస్తే తనమీద రెనగేడ్‌ ముద్ర పడే ప్రమాదముందని తెలిసీ సదాశయం కోసం తెగింపుతో ముందుకెళ్లిన కమ్యూనిస్టు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమైనదే. లాభం తప్ప మరేమీ పట్టని ఈ వ్యవస్థను, మనిషిని యంత్రంగా మార్చే ఈ వ్యవస్థను, మనిషికి మనిషిని నిరంతరం పోటీ పెట్టే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే దానికోసం ఇంతకంటే దుర్మార్గమైన గతాన్ని ఆశ్రయించరాదు అని రచయిత చెప్పారు. ఇది పాతవ్యవస్థ కాదు. దానిని తలదన్ని ఏర్పాటైన కొత్త వ్యవస్థ. కొత్త వ్యవస్థ వల్ల కొన్ని  మార్పులున్నాయి. అవి  మౌలిక మైనవి కావు. పెట్టుబడికి అవసరమైన మార్పులు మాత్రమే. అసమానతలు పోగొట్టే మౌలిక మైన మార్పుల కోసం పోరాటం సాగాల్సిందే. కాకపోతే దానికి పాత మాటలు, పాత సాధనాలు పనిచేయవు అని కూడా రచయిత చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపించింది.
జి ఎస్‌ రామ్మోహన్‌
 (నేల మీద నమ్మకం ఉంటే చదవండి తప్పక!..శీర్షికతో ఏప్రిల్‌10, 2014న సారంగలో అచ్చయిన 'సంవేదన' కాలమ్‌)

తమ్ముడూ పవనూ,

 ఏమన్నా జేస్కో, ఎవురితోనన్నా కలువ్‌, నీ ఇష్టం. కానీ చే బొమ్మ పక్కన మాత్రం మోదీని పెట్టమాకయ్యా! నీకు పుణ్యముంటది. బాంచెన్‌ నీ కాల్మొక్త! భగత్‌ సింగ్‌ పక్కన కూడా వద్దయ్యా! పాటలెన్నైనా పాడుకో! గబ్బర్‌ సింగ్‌ పాటలే పాడుతవో, గద్దర్‌ పాటలే పాడుతవో నీ ఇష్టం. నీకు ఊపు కావాల, ఉత్సాహం కావాల, చేతులు కాళ్లూ ఊపుకోవడానికి రిథమ్‌ కావాల, పాడుకో. జల్సా జేస్కో. ఏమన్నా జేస్కో. ఆ పుటవా మాత్రం, ఆ మోదీ పుటవా మాత్రం ఆళ్ల పక్కన పెట్టమాకు బాబయ్యా! బాంచెన్‌ నీ కాల్మొక్త.

(మార్చి 22న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌. తర్వాత శేఖర్‌గారు తెలుగువార్తలు డాట్‌కామ్‌లో షేర్‌ చేశారు.)

Thursday, 13 March 2014

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌! యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  'మెయిన్‌ల్యాండ్‌'కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ''ఈజీ గోయింగ్ పీపుల్‌". స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
     


వికార ప్రదర్శనకు   'మనం' కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.
ఈ 'మనం' అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ 'మనం' ప్రాంతం అవుతుంది. అపుడు 'వాళ్లు' నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి "అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు 'వాళ్లు' పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ 'మనం' కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ 'మనం' అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ 'మనం' మతం అవుతుంది.  అపుడు 'వాళ్లు' క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం. ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ. ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం. నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
      మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి 'అందాల్ని' ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!
(మార్చి 6, 2014న సారంగ వెబ్‌ మ్యాగజైన్లో ప్రచురితం. 'సంవేదన' అనే కాలమ్‌ ఆరంభ వ్యాసం)

Friday, 14 February 2014

అరవింద్‌ కేజ్రీవాల్‌ దేనికి సంకేతం?

అవినీతి లేని రాజకీయ నాయకులు ఈ దేశానికి కొత్త కాదు. గాంధీ, నెహ్రూ, శాస్ర్తి, మురార్జీ దేశాయ్‌ దాకా వెళ్లనక్కర్లేదు. వర్తమానంలోనూ ఉన్నారు. త్రిపుర నుంచి ఒరిస్సాదాకా తూరుపు ముఖ్యమంత్రులందరూ వ్యక్తిగతంగా మచ్చలేనివాళ్లే. మధ్యభారతం నిండా వాళ్లే. 'చావల్‌బాబా' రమణ్‌సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లకు ఆ మచ్చ లేదు. చివరాకరికి మోదీని కూడా పాపులర్‌ అర్థంలో అవినీతిపరుడని అయితే అనలేం. మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? బుగ్గకారు వద్దనుకునే వారు, అట్టహాసపు భద్రతలు కోరుకోని వారు ఈ దేశానికి కొత్త కాదు.  చైనా యుద్ధంలో ఓటమి తర్వాత జనం నెహ్రూను చుట్టుముట్టి దాదాపు దాడిచేసినంత పనిచేసిన దృశ్యాన్ని, ఆ ఫొటోను ఒకసారి గుర్తు చేసుకోండి. మొన్నమొన్న రక్షణ మంత్రికి భద్రత అవసరం అని ఇంటిముందు సెక్యూరిటీ గేట్‌ పెడితే ఫెర్నాండెజ్‌ విసురుగా దాన్ని విసిరి బయటవేసిన దృశ్యం గుర్తు చేసుకోండి. ఆ చివర ఎర్రని మాణిక్‌ సర్కారు నుంచి ఈ చివర కాషాయ పారికర్‌ దాకా చాలామంది హడావుడికి దూరంగా ఉండాలని కోరుకునేవారే! సింప్లిసిటీనే వాల్యూ అయితే మమతా బెనర్జీని విస్మరించగలమా! మరి కేజ్రీవాల్‌ ఇంత క్రేజీగా ఎందుకు మారారు? పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజోపయోగ పథకాలను అమలు చేసినవారు ఈ దేశానికి కొత్తకాదు. ఎక్కడిదాకానో పోనక్కర్లేదు. ఇందులో మనమే ముందు! ఎమ్జీఆర్‌, ఆయన బాటలో ఎన్టీఆర్‌ అమలు చేసిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, వైఎస్‌ చేపట్టిన ఉచితవిద్యుత్, ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకాలు ఇవాళ కేజ్రీవాల్‌ చేపట్టిన బిజిలీ, పానీ పథకాల కంటే విస్తృతమైనవి. ఒక అర్ఠంలో విప్లవాత్మకమైనవి కూడా!మరి కేజ్రీవాల్‌ ఎందుకింత క్రేజీగా మారారు?

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక చిత్రమైన కాంబినేషన్‌. ఆ కాంబినేషన్ పేరు భిన్నత్వం‌. ఏదో ఒక అంశంలో కాదు. ఆ భిన్నత్వం అన్నింటా కనిపిస్తుంది. మేం సంప్రదాయ రాజకీయ నాయకుల కంటే భిన్నమైనవాళ్లం అనేది ఆమ్‌ ఆద్మీ అస్ర్తం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే అవినీతికి భిన్నం. సంప్రదాయ రాజకీయాల్లో ఉండే హడావుడికి భిన్నం. ప్రజలతో సంబంధాల్లో భిన్నం. వేషభాషల్లో, వ్యవహారశైలిలో భిన్నం. అరవింద్‌ ఖద్దరు మాత్రమే కాదు, బ్రాండెడ్‌ బట్టలు కూడా వేయరు. అన్నిరకాలుగా బ్రాండ్‌ అంబాసిడర్ ఆఫ్‌ అన్‌బ్రాండెడ్‌ లైఫ్‌ అనదగిన మనిషిలాగా ఉంటారు. ఎక్కడా నాయకుడు అనే ఇమేజ్‌లోకి ఒదగడు. మన పక్కింట్లో స్కూటర్‌ మీద క్యారేజ్‌ పెట్టుకుని ఆపీస్‌కి వెళ్లే ఉద్యోగి వలె ఉంటారు. అమోల్‌ పాలేకర్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అనేది సింబాలిజం. తెలుగు సినిమా వారి లాగా కేవలం మేం డిఫరెంట్ అని అంటేనే జనం నమ్ముతారా! ఇక్కడ ఆయన వెనుక ఉన్న, ఆయనను అందలమెక్కించిన రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
అన్నా హజారే లోక్‌పాల్‌ ఉద్యమం కేజ్రీవాల్‌ను ఢిల్లీ వాసులకు పరిచయం  చేసిన మాట వాస్తవమే. నాయకుడిగా జనంలోకి వెళ్లడానికి అవసరమైన ముఖపరిచయం దాంతో ఆయనకు లభించిన మాట వాస్తవమే. కానీ ఈ పాక్షిక సత్యాలేవీ కేజ్రీవాల్‌ పరిణామాన్ని పట్టించలేవు. వ్యక్తి కేంద్రకమైన విశ్లేషణలు పరిణామాన్ని అర్థవంతంగా వివరించలేవు. ఏఏ సమూహాలు తమ నాయకుడిగా కేజ్రీవాల్‌ను చూస్తున్నాయి, ఎందుకు చూస్తున్నాయి అనేది ప్రధానమైన అంశం. 1990ల తర్వాత మధ్యతరగతి తన సైజ్‌ పెంచుకుంటూనే ప్రివిలేజెస్‌ కోల్పోతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు పోయాక రికమెండేషన్ అనే రూపం అంతరిస్తూ వస్తున్నది. ఎమ్మెల్యేల ఇంటి ముందు ఇంతకుముందులాగా క్యూలు కట్టడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దైనందిన సంబంధాలు తగ్గాక ఇతరత్రా చిన్నచిన్న రూపాల్లోని అవినీతి తగ్గిపోతూ వస్తున్నది.  ఓ వందో రెండొందలో ఇచ్చి పనిచేయించుకోగలిగిన రూపాలు ఇపుడు బాగా తగ్గిపోయాయి. జనన, మరణ పత్రాలు, ఓటర్‌, ఆధార్‌ కార్డుల లాంటి వ్యవహరాలు మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో ఇవాళ ప్రభుత్వంతో ప్రజలకు నేరుగా సంబంధాలు లేవు.  సంఖ్య తక్కువున్నపుడే ప్రివిలేజ్‌ పనిచేస్తుంది. సంఖ్యతో పాటు పోటీ పెరిగినపుడు అది ఆర్డర్‌ కోరుకుంటుంది. ఆర్డర్‌ సాంకేతిక రూపంలోకి బదిలీ అయి రైల్వేలో ఇంతకుముందులాగ అవినీతి కనిపించడం లేదని సంబరపడే స్థితి వస్తుంది. గ్యాస్‌ ధరతో పాటు సప్లయ్‌ పెరిగి అందుకోసం కొంతమంది చేతులు తడపాల్సిన స్థితి తప్పిపోతుంది. ప్రభుత్వ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి ప్రైవేట్‌ రంగంలోంచి ఎదిగిన మధ్యతరగతికి తేడా ఉంటుంది. 90ల తర్వాత పెరిగిన మధ్యతరగతి చాలా తొందరగా టాక్స్‌పేయర్‌ భాష నేర్చేసుకుంటుంది. తన రక్తమాంసాలు పిండి కట్టించుకుంటున్న పన్నులు బడా పారిశ్రామిక వేత్తల బొక్కసాలకు అక్రమంగా తరలిపోతున్నాయనే బాధ మధ్యతరగతికి ఇటీవల తీవ్రంగా పెరిగింది. అదే సమయంలో పాలకులు అడ్డదిడ్డంగా పేదలకు, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతున్నదనే బాధ కూడా పెరిగింది. ఈ రెండు బాధలూ మన మీడియాలో ప్రతిరోజూ డిజిటల్‌ డాల్బీ సౌండ్‌లో వినిపిస్తా ఉంటాయి. వారి బాధను తమ బాధగా మార్చుకున్న మీడియా ఈరెండు విషయాల్లోనూ దూకుడుగా ఉంటుంది. అదే సమయంలో మొదటి బాధ మరీ ఎక్కువైతే అభివృద్ధి కుంటుబడే ప్రమాదముందనే వాదనను కొందరి నోటి గుండా వినిపిస్తూ ఉంటుంది. రెండో బాధను నేరుగా వ్యక్తీకరిస్తే పేదలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం గొంతు మార్చి సబ్సిడీలు లబ్ధిదారులకు చేరడం లేదని పక్కదారి పడుతున్నాయని మాట్లాడుతుంది. రెండువైపులా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాలకులు కూడా అటూ ఇటూ బ్యాలెన్స్‌ చేయలేక అందర్నీ సంతృప్తి పరిచడానికి నానా విన్యాసాలు చేస్తున్నారు. ప్రకృతి వనరులను తమ క్లాస్‌కు కట్టబెట్టడంలోని అవినీతి బయటపడినపుడు కొంతమంది హైప్రొఫైల్‌ వ్యక్తులను జైళ్లలో వేయడం దగ్గర్నుంచి ఇటు ఆహార భద్రతా పథకం లాంటి పథకాలను పేదలకోసం వండి వడ్డించడం దాకా అటూ ఇటూ దరువేస్తూనే ఉన్నారు. అవినీతి ఆరోపణలకు భయపడి ప్రాజెక్టుల విషయంలో పట్టిపట్టి వ్యవహరించడం వల్ల అభివృద్ధి, దానికి సంకేతమైన జిడిపి దెబ్బతిన్నాయనే వాదనతో తలలు పట్టుకుంటూనే ఉన్నారు. మధ్యతరగతిలోనూ ఆ భావన రకరకాలుగా ఉంది. పాలన కనుక సక్రమంగా చేయగలిగితే రంధ్రాలను పూడ్చగలిగితే అభివృద్ధి వేగం కొనసాగిస్తూనే టాక్స్‌ మనీని సద్వినయోగం చేయొచ్చనే భావనను కొంతకాలంగా పెంచుతూ వచ్చారు. డెలివరీ సిస్టమ్స్‌లో పందికొక్కులను దూరంగా ఉంచగలిగితే న్యాయం జరుగుతుందనే భావన బలపడింది.  ఇది కాకుండా ఇంకో ఆవేదన ఉంది. 90ల తర్వాత రాజకీయాలు మధ్యతరగతికి పూర్తి దూరంగా వెళ్లపోయాయి. పేదరికం కొంత తగ్గించి జనాల కొనుగోలు శక్తి పెంచగలిగినప్పటికీ కొత్త ఆర్థిక విధానాలు అసమానతలను అన్ని రకాలుగా అమానవీయంగా పెంచేశాయి. ముఖ్యంగా రాజకీయ తరగతి పూర్తి ప్రత్యేక తరగతిగా మారిపోయింది. వ్యాపారాలకు రాజకీయాలకు తేడా చెరిగిపోయింది. తమ తమ వ్యాపార సామ్రాజ్యాలను పెంచుకోవడానికి అధికారాన్ని సాధనంగా వాడుకునే ధోరణి పెరిగింది. రాజకీయాల్లో అవినీతి ఉండొద్దని అంతా మాట్లాడతారు గానీ రాజకీయ నేతలు వ్యాపారాలు చేయకూడదని ఒక్క నేతా మాట్లాడలేరు. దిగ్విజయ్‌ సింగ్ ఆ మధ్య అలాంటి మాట గొణిగినట్టుగా అన్నారు కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకున్నవారు లేరు. అంతగా రాజకీయాలు వ్యాపారాలు కలగలిసి పోయాయి. సామాన్యుడికి పూర్తి దూరంగా వెళ్లిపోయాయి. వ్యక్తిగత నిజాయితీ వేరే. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన నాయకుల్లో నిజాయితీపరులు ఇప్పటికీ ఉన్నారు. సమూహ లక్షణం ముందు వ్యక్తుల మంచిచెడ్డలు పనిచేయవు. ఇంతకుముందు విద్యార్థి సంఘాల ఎన్నికలనుంచో ట్రేట్‌ యూనియన్లనుంచో కొద్ది మందైనా మధ్యతరగతి రావడానికి ఆస్కారముండేది. ఇవాళ ఎన్నికల ఖర్చు, అక్కడున్న హడావుడి మధ్యతరగతి అటువైపు తొంగి చూడడానికే ఆస్కారం లేకుండా చేశాయి. ఓటు వేయడం మినహాయిస్తే ఇతరత్రా రూపాల్లో పాలనా పరంగా తన గొంతు వినిపించే అవకాశాన్ని మధ్యతరగతి పూర్తిగా కోల్పోయింది. ఈ కోపం  మధ్యతరగతికి తీవ్రంగా ఉంది. ఇటువంటి సమయంలో జిందా తిలిస్మాత్‌ లాగా వచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్. వాళ్ల ఆశలకు రూపమిచ్చినవాడు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ పరిస్థితి ఇవాళ ఇప్పటికిప్పుడు తయారైందేమీ కాదు. చాలాకాలంగా మధ్యతరగతిలో ఇటువంటి అభిప్రాయాలు పెరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఏదైనా ప్రయోగం జరిగినా ఇది అయ్యేదికాదు, పొయ్యేది కాదు అనేభావన ఉంటుంది. ఆ ముద్ర పడకుండా ఇది అవగలదు అనే నమ్మకాన్ని కలిగించడంలో ఆమ్‌ ఆద్మీ సక్సెస్‌ దాగుంది. మైగ్రేంట్‌ మిడిల్‌క్లాస్‌ కేంద్రీకృతమై ఉండే ఢిల్లీ, టీవీ కెమెరాలు-గొట్టాల ప్రభావం ఎక్కువగాఉండే ఢిల్లీ అతనికి ఫెర్టైల్‌ గ్రౌండ్‌ లాగా ఉపయోగపడింది.
పూర్తిగా మధ్యతరగతేనా! బస్తీలు కూడా అతనికి ఓటేశాయి కదా, దాని సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది. అక్కడ ఆయన వ్యవహారశైలి, డ్రెస్‌, మొహల్లా మీటింగ్స్ అన్నీ ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఆయన టక్కు టెక్కుగా మొకం గంభీరంగా పెట్టుకుని నేను చెపుతున్నాను, మీరు వినాలి అనే బాపతు కాదు. డబ్బులోనూ అధికారంలోనూ తనకంటే పెద్దవారితో వ్యవహరించేపుడు దూకుడుగా కనిపిస్తాడు. ఉపన్యాసకుడిగా కనిపిస్తాడు. బస్తీ సమావేశాల్లో వినయంగా కనిపిస్తాడు. శ్రోతగా కనిపిస్తాడు. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ ప్రచారాన్ని గమనిస్తే కనిపించే అంశమిది. ఎన్నికల గుర్తు చీపురు కూడా ఆమ్‌ఆద్మీకి దగ్గరకావడానికి తనవంతు సాయం చేసింది.  పైపెచ్చు కరెంట్‌ చార్జీలు సగానికి సగం తగ్గించడం, అన్ని ఇళ్లకు 666 లీటర్ల నీటిని సప్లయ్‌ చేయడం అనే మాటలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ పేదలను ఆకర్షించగలిగిన వ్యవహారాలు. ఇతను 'మేధావి' అనే ముద్ర పడకుండా చూసుకున్నారు. మనకోసం రోడ్డెక్కే వ్యక్తి, మన కోసం పెద్దపెద్దోళ్లను ఎంతమాటైనా అనగలిగిన వ్యక్తి అనే రెబెల్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. ఇది చిన్నవిషయమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ గందరగోళ విధానాల వల్ల అటూ ఇటూ విసిగిపోయి పొలిటికల్‌ క్లాస్‌ మీద పెంచుకున్న కోపానికి ఒక రూపునిచ్చారు. పొలిటికల్‌ క్లాస్ లోనికి ఎంట్రీపాయింట్‌ లేక మధ్యతరగతి పడుతున్న వేదనకు సమాధానంలాగా ముందుకొచ్చారు. ఆయనలో లేని కమ్యూనిస్టును చూసి తిట్టిపోసేవారైనా, ఆ తానులో ముక్కే అనే తేల్చపడేసేవారైనా పరిస్థితిని పూర్తిగా అర్థంచేసుకుని తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కాదు. పొలిటికల్‌క్లాస్‌కి ఆయనొక హెచ్చరిక. కొత్త ఆర్థిక వ్యవస్థ భారత్ లో బలపడిందని కొన్ని ప్రాంతాల్లో దాని తాలూకు భావజాలం పూర్తి స్తాయిలో ఆవరించి అది ఆర్డర్‌ కోసం వెతుక్కుంటోందని అనుకోవచ్చు. మార్కెట్‌ విస్తరణకు కూడా కొన్ని సమయాల్లో ఆర్డర్‌ అవసరమవుతుంది. అవినీతి అనేదే దానికి అడ్డుకట్టగా మారితే దాని ప్రదర్శిత రూపాలను రద్దు చేసుకోవడానికి అది సంశయించదు. స్థూలమైన అర్థంలో ఉత్పత్తి మెరుగుపడుతున్నప్పటికీ సప్లయ్‌ చెయిన్స్‌, డెలివరీ సిస్టమ్స్‌ మరీ నాసిరకంగా ఉన్న తరుణాన జయప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణక్రాంతితో ముందుకొచ్చారు. ఉత్పత్తితో పాటు సప్లయ్‌చెయిన్స్‌ కూడా మెరుగుపడి డెలివరీ-డిస్ర్టిబ్యూషన్‌ ఘోరంగా ఉన్న తరుణాన అరవింద్‌ కేజ్రీవాల్‌ అవతరించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కాలం కడుపుతో ఉండి కేజ్రీవాల్‌ను కన్నది. ఈ పార్లమెంటరీ తిరుగుబాటు దారుడి అవతారం ఎంతకాలం ఉంటుంది అనేది వేరే సంగతి. మేం అన్నింటిలోనూ భిన్నం అనే ఇమేజ్‌ని అరవింద్‌ బృందం ఎంతకాలం కాపాడుకోగలదు అనేది ఇపుడు ఆసక్తికరమైన అంశం.
జి ఎస్‌ రామ్మోహన్‌(ఆంధ్రజ్యోతి-8-1-2014)

Tuesday, 7 January 2014

సుబ్బక్క సుప్రభాతం

"నా బట్టల్లారా..నా సవుతుల్లారా
మీ ముక్కులో నా సాడు బొయ్య
మీ చేతిలో జెట్ట బుట్ట
మీకు గత్తర తగల
మీ తలపండు పగల
మీ వొంశం మీద మన్ను బొయ్య......."
సుబ్బక్క సుప్రభాతంతో పల్లె రెక్కలిప్పుకుంది.
చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది.
"ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌....ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే..."
చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు.
"తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా...ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా...అందుకే సావొస్త లేదు"...
మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క.
"నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే" అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు.
సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది.  తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది.
"యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా...పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే...మీ కుదురు నాశనం కాను"....
సుబ్బక్క డోస్‌ పెంచేసింది.
"ఏందే బాసిలా...పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా"..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట.
"అది పిడికెడా..ఎవురే లేకిది...పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే"...సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క.
"ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల....నా సవితి, ఇపుడు తేలాల...నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల...ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల"...
అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు "నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు" అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు.
"లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం" అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా.
తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు.
ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. 'కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే' అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు.  'మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది' అనేది అర్తం కాకపాయె.  'పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి' అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు.
       హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం...బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా!  లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు.  సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది.
'నువ్వేమన్నా చెయ్యి నాయనా....నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల'. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది.  మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. "కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు" అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది.
బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది.

...............................................................................................................
కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది.
"మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు.  నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!"....
ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే.
"ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు" అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క.
"మంజీర గదా, బానే ఉంటయ్‌"...అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది.
ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు.
'ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా...ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది' అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు.
రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు.
"అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా...ఇదేమైనా మనూరనుకున్నావా....అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌"..అని సలహా ఇచ్చేసినాడు...ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు.
మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది.
"స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా...పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా".. అనునయంగా  పెద్దరికం చూపిచ్చింది.
"చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా"...
కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క.
'చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట  కాలితో చేత్తో  ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు' అనుకుని ఆశపడింది. "ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో" అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది.
సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. 'ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!'
"ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది"...ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు.
మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి  తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. "ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే" అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో!
దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. "ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది" అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది.
"నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా......అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా...ఇంత సదువుకుని ఏం పనిరా ఇది" అని చేతిలో గంటె లాగేసుకుంది.
"నువ్వుండమ్మా...చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా...క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ"...
"ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా... అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా"
కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు.
కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా.
సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు.
'ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా...సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి "ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె" అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా"....చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది.
తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు.
వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు.
" ఇట్ట తింటే ఎట్ట!...తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల." అని ప్రేమ చూపిచ్చబోయింది.
"మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ" అంది కోడలు పిల్ల.
"అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది". రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు.
'నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు' లోలోపల కాలిపోతోంది సుబ్బక్క.
"ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!" ....మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది.
పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది.
"చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది.  రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు"....తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క.
ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు!
 ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం.
బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు.
"అమ్మొక్కతే ఏం చేస్తాది,  తీసుకుపోదాం" అన్నాడు కొడుకు.
కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా "నువ్వు కూడా తయారవు" అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క "ఎందుకులే నాయినా...ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి" అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది.
"లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ" చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు.
గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది.
"ఎంత బెమ్మాండంగా కట్టినారురా...అబ్బో అబ్బో" అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. "ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు" అని అర్తమైపోయింది.
గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు  రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది.
"ఎంతయినాదిరా" అని అడిగింది గేట్లోంచి బయటపడగానే.
అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో....
"ఎంతయితే ఏమిట్లెండి" అని అడ్డుపడింది కోడలు పిల్ల.
"అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే...మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా...ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు"...సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది.
"నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి.....అయినా మీకెందుకివ్వన్నీ"....పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం.
హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది.
"అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా...అయినా నేనేమంటి... ఎంతయిందిరా అని అడిగితి" గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది.....
"అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో"
"మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా"..
కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌.
"మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా....నువ్వు మహారాణివైపోతివి...నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే  నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా.... దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు ...రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!"..
కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.
ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది.
కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది.
"ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా...ఆయన ఎట్టుండేటోడు". భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది.
"నోరెత్తనిచ్చేటోడా...నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!"....
"మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా"....భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క.
"మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల...పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!"
కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క.
స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది.
"చీ..ఎదవగొడవ...ఎదవ మొకాలు" అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది.
"ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు" ...కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు.
"ఎవురే, ఎదవ మొకాలు". ....ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క.
"నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ....ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే"...ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క.
ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి..."ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ" అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి.
"కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే  నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!"
"ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు".. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది..
యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం "అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు" అని అసహనంగా అనునయించాడు.
"పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా...కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!"..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
"ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను" ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క.
తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. "లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు" అని ఏవోవో గొణుక్కుంటా ఉంది.
కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే  అతనికి మా చెడ్డ చిరాకు.
అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి.
.............................................
"అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం".....సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది.
"కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా....నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా.... వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే...కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు...."
గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క.  గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.
సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా.
సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక  జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా.
(బొమ్మ వేసిన వారు- అక్బర్‌ )
(సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో డిసెంబర్‌ మాసంలో ప్రచురితం)

Wednesday, 27 November 2013

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం


             ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ   ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో  విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే  మ్యాగజైన్‌లో యాతండీ వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ  మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌.
     మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా.  మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య  అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు  పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్‌ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం  వినిపించినంతగా సెన్సిబిల్‌ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్‌ సెన్సిబిల్‌ సినిమా, షిప్‌ ఆఫ్‌ థీసెస్‌  సెన్సిబిల్‌ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం.  సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్‌ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి  వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.

    ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు  తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన  పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో  పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్‌ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ.  సోమయాజి,  సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి  తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప.  అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా  చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్‌ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు.  సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.
          60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్‌ ప్రచారం చేశారు. ఈ అమ్మ "కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ'' కాదు. "ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ'' కాదు.   ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్‌ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా "శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న'' రైతో మరొకరో  కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్‌ అప్పదాసు.   శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది  కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్‌ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త  వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. "వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న" భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు  తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి  మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయి సామాజిక  సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు.  మళ్లీ ఇపుడు వృత్తులను  ఆరాధించే పద్ధతిలో  వాటి చిహ్నాలను చూపిస్తే  అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!


     అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్‌ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే.  అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే  ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా  చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు  మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని  వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి  మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్‌ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే  సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే  ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు  సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి  ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు  పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా,  పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో.  ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ  సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్‌  శంకర్‌మఠ్‌, విద్యానగర్‌ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్‌ కాలేజీ రైల్వేస్టేషన్‌ బెంచీలమీద కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా  మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.
     వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు  అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది.  అదే సమయంలో  పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది.  మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్‌ తోనో కాకుండా తమ ఒడిలో  కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో  చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది.  రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి  మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు.  గ్రామీణ జీవనంలో కోల్పోయిన 'ఆనందాల' కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో  ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని  విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది  అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని  విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా  "రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము'' అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్‌ పెట్టి నానా యాగీ  చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది.  కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను  చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి.  అందువల్ల ఆ భాష వదిలేసి దాని  బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ  ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.
        ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్‌ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్‌ షో  చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే  ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్‌ ఛేంజ్‌ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! "వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం,  ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి" అని సోమయాజి ఉరఫ్‌ అప్పదాసు ఉరఫ్‌ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ  ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్‌ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా!   ఏ సంప్రదాయ  జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్‌ కూడు తిని అనారోగ్యంగా  తయారయ్యామని, గ్రామాల్లో  రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని  మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్‌  వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్‌ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి  మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం  అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్‌ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.  70ల్లో కూడా  టింగురంగా అంటూ టీషర్ట్‌, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం 'అత్యాధునిక' మాయ.

    ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ!  మేమొక సినిమా తీశాం, మంచి సినిమా  తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు,  సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ!  అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను  ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో  నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని  చెట్లను మెయిన్‌టెయిన్‌ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా  ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా  ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ  లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా  అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్‌  కొట్టించితిరి కదా, మరి గ్యాస్‌ స్టవ్‌ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్‌ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్‌  కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్‌ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్‌ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి,  బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్‌. వాటిని డిస్ట్రబ్‌ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా  కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.  
         " రిటైర్‌మెంట్‌ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా  ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్‌ చేసి పెట్టాం'' అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని  సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్‌ ఏలియన్స్‌ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్‌ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!
(జి ఎస్‌ రామ్మోహన్‌)
(సారంగ వెబ్‌మ్యాగజైన్‌లో 2013 నవంబర్‌ 14న ప్రచురితం)